భవిష్యత్తులో అనేక సవాళ్లు ఎదురుకానున్నందున వాటిని అధిగమించేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. డీలిమిటేషన్ ప్రక్రియ, మహిళా రిజర్వేషన్ల అమలు, జమిలి ఎన్నికల నిర్వహణ వంటి కీలక పరిణామాలు భవిష్యత్తులో చోటుచేసుకోనున్నాయని ఆయన పార్టీ నేతలకు వివరించారు. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. త్వరలోనే మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగా, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే సమాయత్తం చేయాలని ఆయన సూచించారు.పార్టీ కోసం నిరంతరం శ్రమించే వారికే సముచిత స్థానం లభిస్తుందని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. "మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా పనిచేయాలి. ఇందుకోసం బూత్ స్థాయి నుంచి గ్రామ, మండల స్థాయి వరకు పార్టీ కమిటీలను పటిష్టంగా ఏర్పాటు చేయాలి. పార్టీ కమిటీల్లోని నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేయాల్సిందే. పనితీరు కనబరిస్తేనే పదవులు దక్కుతాయి. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అండగా నిలిచి, కష్టపడి పనిచేసిన వారికి ఇప్పటికే పదవులు ఇచ్చాం, భవిష్యత్తులో కూడా ప్రాధాన్యత ఉంటుంది" అని రేవంత్ రెడ్డి అన్నారు.నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకుని పార్టీ నాయకులు ముందుకు సాగాలని ఆయన హితవు పలికారు. అవసరమైతే తాను కూడా గ్రామాల్లో పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పార్టీ, ప్రభుత్వం మధ్య పూర్తి సమన్వయంతో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa