ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఏర్పాట్లపై పొన్నం సమీక్ష

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 24, 2025, 05:11 PM

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను అత్యంత వైభవంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా సహకరించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ, స్థానికులు, భక్తుల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఆయన నొక్కిచెప్పారు.జూలై 13, 14 తేదీలలో జరగనున్న ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఉదయం దేవాలయ ప్రాంగణంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, ఆయా శాఖలు చేపడుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని, వారికి ఆతిథ్యం ఇవ్వడంలో నగర ప్రజలు ఎప్పుడూ ముందుంటారని, ఈసారి కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని మంత్రి కోరారు.ఉదయం నుంచి ఉపవాస దీక్షలతో, తలపై బోనాలతో అమ్మవారి దర్శనానికి వచ్చే మహిళా భక్తులకు ప్రాధాన్యతనిచ్చి, వారు త్వరగా దర్శనం చేసుకునేలా చూడాలని, వీఐపీలు సైతం ఇందుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత ఏడాది ఎదురైన చిన్న చిన్న సమస్యలను సమీక్షించుకొని, ఈసారి అలాంటి పొరపాట్లకు తావులేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ముఖ్యంగా దేవాలయం లోపల, వెలుపల విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా విద్యుత్ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. గోల్కొండ, బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, లాల్ దర్వాజ బోనాలతో పాటు నగరంలోని సుమారు 3000 దేవాలయాల వద్ద జాతరలను విజయవంతం చేసేందుకు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతర జరిగే ప్రాంతాల్లో అదనపు మంచినీటి సరఫరా చేయాలని జలమండలి అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, దేవాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో పూర్తిగా సీసీ రోడ్లు, అవసరమైన చోట్ల బీటీ రోడ్లు నిర్మించాలని కోరారు. గతంలో ఇక్కడ పనిచేసి, అనుభవం ఉన్న పోలీస్ ఇన్ స్పెక్టర్లను నియమిస్తే బందోబస్తు ఏర్పాట్లు మరింత సమర్థవంతంగా ఉంటాయని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు.ఈ సమీక్షా సమావేశంలో దేవదాయ శాఖ కమిషనర్ వెంకట్రావ్, జిల్లా కలెక్టర్ హరిచందన, జాయింట్ కమిషనర్ విక్రం సింగ్ మాన్, ట్రాఫిక్ అదనపు కమిషనర్ జోయల్ డేవిస్, డీసీపీ రష్మి పెరుమాళ్, డిప్యూటీ మేయర్ మోతె శోభన్ రెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, కార్పొరేటర్ చీర సుచిత్ర, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్, జలమండలి డైరెక్టర్ అమరేందర్ రెడ్డి, ఆలయ ఈవో మనోహర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa