హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం తన ఘనతల పరంపరకు మరో కలికితురాయిని జత చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ప్రాంతీయ పాస్పోర్టు అధికారుల సమావేశం-2025లో, 2024-25 సంవత్సరానికి గాను ‘సంస్కరణలు, ప్రజా సేవపట్ల నిబద్ధత’ విభాగంలో హైదరాబాద్ ఆర్పీవో ప్రతిష్ఠాత్మక అవార్డును గెలుచుకుంది. ఇదే వేదికపై, పాస్పోర్టు వెరిఫికేషన్ ప్రక్రియలో ఉత్తమ సేవలు అందించినందుకు తెలంగాణ పోలీసు విభాగానికి కూడా పురస్కారం లభించింది.మంగళవారం జరిగిన 13వ పాస్పోర్టు సేవా దివస్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గెరిటా ఈ అవార్డులను ప్రదానం చేశారు. హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారిణి జొన్నలగడ్డ స్నేహజ, హైదరాబాద్ ఆర్పీవో తరఫున ఈ పురస్కారాన్ని స్వీకరించారు. నిరంతర సంస్కరణలు చేపడుతూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో హైదరాబాద్ కార్యాలయం కనబరిచిన నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు.అదేవిధంగా, పాస్పోర్టు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతంగా, సమర్థవంతంగా నిర్వహించినందుకు తెలంగాణ పోలీసు విభాగాన్ని కూడా కేంద్రం ప్రశంసలతో పాటు అవార్డుతో సత్కరించింది. తెలంగాణ పోలీసుల పక్షాన రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం డీజీ బత్తుల శివధర్రెడ్డి ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ గుర్తింపు, రాష్ట్ర పోలీసుల సేవా నిరతికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ పౌర సేవలను మెరుగుపరచడంలో వారి కృషికి దక్కిన గౌరవంగా భావిస్తున్నారు. ఈ కార్యక్రమం ఢిల్లీలో జరుగుతున్న ప్రాంతీయ పాస్పోర్టు అధికారుల వార్షిక సమావేశం-2025లో భాగంగా జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa