1975లో భారతదేశంలో ప్రకటించిన ఎమర్జెన్సీ పాలన దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోయిందని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ ప్రకటనకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఎక్స్’ వేదికపై స్పందిస్తూ, ఈ పాలన వ్యక్తి స్వేచ్ఛను హరించి, రాజ్యాంగాన్ని అవమానించిన దారుణ సంఘటనగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ అప్పటి నిర్ణయం దేశ ప్రజాస్వామ్యానికి తీవ్ర గాయం కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమర్జెన్సీ కాలంలో వ్యక్తిగత హక్కులు, స్వేచ్ఛలు అణచివేయబడ్డాయి. అనేక మంది రాజకీయ నాయకులు, కార్యకర్తలు జైళ్లలో మగ్గారు. ఈ కఠిన పరిస్థితుల్లోనూ రాజ్యాంగ విలువలను కాపాడేందుకు పోరాడిన మహనీయుల త్యాగాలను బండి సంజయ్ స్మరించారు. వారి సేవలు దేశ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.
ఎమర్జెన్సీ దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణకు ఎంత గొప్ప పోరాటం అవసరమో గుర్తు చేస్తుందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. ఈ చీకటి రోజులు మళ్లీ రాకుండా, రాజ్యాంగ హక్కులను గౌరవిస్తూ, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం ప్రతి పౌరుని బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa