ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ లో ఆషాఢ బోనాల సంబురం ప్రారంభం..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 25, 2025, 02:59 PM

హైదరాబాద్ లో ఆషాఢ బోనాల సందడి మొదలైంది. తొలిబోనం గోల్గొండ జగదాంబికకు సమర్పించన్నారు. జూన్ 26 ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది.. ఆషాడంలో వచ్చే తొలి గురువారం లేదా ఆదివారం రోజు బోనాల సంబురం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఆషాఢ మాసం జూన్ 26 గురువారం నుంచి ప్రారంభమవుతోంది. ఈ నెల మొత్తంమీద వచ్చే గురువారం, ఆదివారాల్లో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఏటా ఉత్సవాలు ప్రారంభమయ్యేది గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మవారి సన్నిధి నుంచే. జూలై 13 ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి కి భక్తులు బోనాలు సమర్పించనున్నారు. జూలై 20న పాతబస్తీ బోనాలు జరుగుతాయి. జూలై 21న జరగనున్న ఘటాల ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయి. బోనాల షెడ్యూల్ లో భాగంగా జూన్ 26 గురువారం తొలిపూజ, జూన్ 29 ఆదివారం రెండో పూజ, జూలై 3 గురువారం మూడో పూజ, జూలై 6 ఆదివారం నాలుగో పూజ, జూలై 10 గురువారం ఐదోపూజ, జూలై 13 ఆదివారం ఆరో పూజ, జూలై 17 గురువారం ఏడో పూజ, జూలై 20 ఆదివారం ఎనిమిదో పూజ, జూలై 24 గురువారం తొమ్మిదవ పూజ జరగనుంది. జూన్ 26 గురువారం గోల్కొండ నుంచి మొదలు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే మొదటి బంగారు బోనంతో ఆషాఢ మాస బోనాల జాతర ప్రారంభమవుతుంది. మొదటి రోజు లంగర్హౌజ్ చౌరస్తా నుంచి తొట్టెల ఊరేగింపు , చోటాబజార్లోని ఆలయ పూజారి ఇంటి నుంచి అమ్మవారి విగ్రహం, బంజారాదర్వాజ నుంచి మొదటి బోనం ఊరేగింపు జరుగుతుంది. ఇవన్నీ గోల్కొండ కోటకి చేరుకున్నాక ఆలయం ట్రస్టు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సప్తమాతృకలకు సమర్పించే బంగారు బోనంలో భాగంగా తొలిబోనం జగదాంబికకు సమర్పిస్తారు. తెలంగాణలో బోనాల ఉత్సవాల్లో భాగంగా ఏటా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు కూడా బోనం సమర్పిస్తారు. ఈ ఏడాది జూన్ 29న దుర్గమ్మకు బోనం సమర్పిస్తారు. ఇది రెండో బోనం అవుతుంది. జూలై 3 గురువారం బల్కంపేట అమ్మవారికి బోనం సమర్పిస్తారు..ఇదో మూడో బంగారు బోనం. జూలై 4 శుక్రవారం రోజు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి నాలుగో బంగారు బోనం సమర్పిస్తారు.. శుక్రవారం పెద్దమ్మకు చాలా ప్రత్యేకమైన రోజు. జూలై 10 గురువారం రోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు..ఇది ఐదో బంగారు బోనం. జూలై 15 చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారికి, జూలై 17న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల కోసం తెలంగాణ ప్రభుత్వం 20 కోట్ల నిధులు మంజూరు చేసింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa