ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక కామెంట్స్..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 25, 2025, 03:23 PM

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదిరమ్మ ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తుంది. ఈ మొత్తాన్ని వివిధ దశల్లో లబ్దిదారులకు అందజేస్తుంది. అంతేకాకుండా ఒక్కో ఇంటికి 40 మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితంగా అందించనున్నట్టుగా చెబుతోంది. అయితే తాజాగా రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం రోజున రాష్ట్ర సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 22,500 కోట్ల రూపాయలతో నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్‌ఎంసీ) మినహా రాష్ట్రంలోని 95 నియోజకవర్గాలకు గాను 88 నియోజకవర్గాలలో లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. వర్షాకాలం సీజన్ ను దృష్టిలో పెట్టుకొని గ్రౌండింగైన ఇండ్లను వీలైనంత త్వరగా బేస్‌మెంట్ పనులు పూర్తి చేసుకునేలా నిరంతరం మానిటరింగ్ చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియ శరవేగంగా సాగుతోందని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల ఇండ్లు మంజూరు చేయగా ఇందులో 2.37 లక్షల లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను కూడా అందించినట్టుగా తెలిపారు. 1.03 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయి, వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం ఒక్కో ఇంటి కోసం 40 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తున్నట్టుగా చెప్పారు. ఈ ప్రయోజనాన్ని పూర్తిస్థాయిలో లబ్ధిదారులు పొందే విధంగా క్షేత్ర స్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు,గ్రౌండింగ్ లో సూర్యాపేట, పెద్దపల్లి, భూపాలపల్లి, హనుమకొండ, వికారాబాద్, సిద్దిపేట, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల పనితీరు మరింత మెరుగు పడాలని, తక్షణమే ఆయా జిల్లాలపై దృష్టి సారించాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిధులను ఏమాత్రం ఆలస్యం చేయడం లేదని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని బట్టి లబ్దిదారులకు ప్రతి సోమవారం చెల్లింపులు జరుపుతున్నామని చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా నాలుగు విడతల్లో ఇందిరమ్మ లబ్దిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోని జమ చేస్తున్నామని వివరించారు. బేస్‌మెంట్ పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు, గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత 1.25 లక్షలు, స్లాబ్ పూర్తయిన తర్వాత 1.75 లక్షలు, మిగిలిన పనులు పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు విడుదల చేస్తున్నాం. ఇంటి స్థలాలు లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇప్పటివరకు కేటాయించని డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్లను కేటాయించనున్నామని తెలిపారు. అయితే మొండి గోడలతో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ ముందుకు రాని పక్షంలో లబ్ధిదారులే పూర్తి చేసుకోవడానికి ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వమే అందిస్తుందని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉన్న జీహెచ్ఎంసీ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa