కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానం సిఫార్సుల మేరకు.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ).. సంచలన నిర్ణయం తీసుకుంది. 2026 విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ పది పరీక్షలను ఏడాదికి రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ రెండు పరీక్షల్లోనూ ఎక్కువ వచ్చిన మార్కులనే తుది ఫలితాలకు పరిగణిస్తామని తేల్చి చెప్పింది. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకే.. ఈ మార్పులు తీసుకువచ్చినట్లు సీబీఎస్ఈ వెల్లడించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానం 2026 నుంచి అమల్లోకి రానుండగా.. దానికి అనుగుణంగా సీబీఎస్ఈ తాజాగా కొత్త నిబంధనలకు ఆమోదం తెలిపింది.
నూతన జాతీయ విద్యా విధానం సిఫార్సుల మేరకు ఈ మార్పులు చేసినట్లు సీబీఎస్ఈ పరీక్షల విభాగాధిపతి సన్యం భరధ్వాజ్ తెలిపారు. సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ తొలి విడత పరీక్షలను ఫిబ్రవరిలో నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ నెలలో వెల్లడించనున్నట్లు వివరించారు. ఆ తర్వాత రెండో విడత పరీక్షలను మే నెలలో నిర్వహించి.. వాటి ఫలితాలను జూన్ నెలలో ప్రకటించనున్నారు. అయితే రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించనుండగా.. ఇందులో తొలి విడత పరీక్షలకు విద్యార్థులు తప్పకుండా హాజరు కావాలని సీబీఎస్ఈ బోర్డు స్పష్టం చేసింది. ఇక రెండో విడత పరీక్షలకు హాజరు కాకున్నా ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. అయితే రెండు విడతల్లోనూ ఎందులో ఎక్కువ మార్కులు వస్తే.. వాటినే ఫైనల్ మార్కులుగా పరిగణించనున్నట్లు తేల్చి చెప్పింది.
పదో తరగతి విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరచుకునేందుకే ఈ రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించడం వెనుక ముఖ్య ఉద్దేశ్యమని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఏదైనా ఒక విద్యార్థి మొదటి విడత పరీక్షలో తక్కువ మార్కులు పొంది.. రెండో విడతలో మళ్లీ పరీక్ష రాసి అంతకన్నా ఎక్కువ మార్కులు తీసుకువచ్చుకుంటే.. వాటినే తుది మార్కులుగా పరిగణనలోకి తీసుకుంటారని సీబీఎస్ఈ అధికారులు తెలిపారు. అదే మొదటి విడత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చి.. రెండో విడత పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినట్లయితే.. మొదటి దశ పరీక్షలో వచ్చిన ఎక్కువ మార్కులనే ఫైనల్గా పరిగణిస్తారని చెప్పారు. అయితే రెండు దశల పరీక్షలను కూడా పూర్తిస్థాయి సిలబస్తోనే నిర్వహిస్తామని సీబీఎస్ఈ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
అయితే ఇంటర్నల్ అసెస్మెంట్ మాత్రం ఏడాదికి ఒకసారి మాత్రమే నిర్వహించనున్నట్లు సన్యం భరధ్వాజ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ముసాయిదా ప్రకారం.. మొదటి విడత సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ మధ్య నిర్వహించనున్నారు. ఇక రెండో దశ పరీక్షలు మే 5వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు జరగనున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa