హైదరాబాద్లోని జీడిమెట్లలో ఇటీవల వెలుగు చూసిన కన్నతల్లి హత్య కేసులో సంచలనాత్మక వివరాలు బయటపడ్డాయి. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించిన ప్రకారం.. ఈ దారుణానికి కుమార్తెనే కారణమని, ఆమె తన ప్రియుడితో కలిసి ఈ నేరానికి పాల్పడిందని తెలిపారు. మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒక పదవ తరగతి చదువుతున్న బాలిక, తమ ప్రేమ వ్యవహారాన్ని వ్యతిరేకించి, మందలించిన తల్లిని కిరాతకంగా చంపేయడం అత్యంత దారుణం. దీంతో పాటు మరో విషయాన్ని పోలీసులు రివీల్ చేశారు. ఏంటంటే.. హత్యకు గురైన తల్లి అంజలికి, ఆమె కుమార్తె తేజశ్రీకి మధ్య గత కొంతకాలంగా తీవ్ర వివాదాలు ఉన్నాయి. తేజశ్రీ మొదటి భర్త కుమార్తె కావడంతో, అంజలి తనను సరిగ్గా చూసుకోలేదని, చిన్న కూతురిని మాత్రం బాగా చూసుకునేదని, తనను చిత్రహింసలు పెట్టేదని తేజశ్రీ ఆరోపించింది. ఏకంగా ఏడవ తరగతిలోనే తేజశ్రీ తన తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసి, కొద్ది రోజులు హోమ్లో ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించినట్లు తెలిపారు.
పదో తరగతి చదువుతున్న తేజశ్రీకి ఇన్స్టాగ్రామ్ ద్వారా శివ (19) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారి, ఇద్దరూ గాఢ ప్రేమలో మునిగిపోయారు. ఫోన్లు, సందేశాలతో పాటు, బయట కలవడం ప్రారంభించారు. ఈ విషయం తేజశ్రీ తల్లి అంజలికి తెలియడంతో ఆమె తీవ్రంగా మందలించింది. ఈ వయసులో ప్రేమ వ్యవహారాలు సరికాదని.. చదువుపై దృష్టి పెట్టాలని ఆమె కూతురికి హితవు పలికింది. అయితే.. తల్లి అడ్డు చెప్పడంతో తేజశ్రీ తల్లిపై పగ పెంచుకుంది. తమ ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిని చంపేయాలని నిర్ణయించుకొని ఈ విషయాన్ని ప్రియుడు శివకు చెప్పింది. వారం రోజుల క్రితం తేజశ్రీ శివతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీనిపై తల్లి అంజలి జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. మూడు రోజుల తర్వాత బాలిక తిరిగి ఇంటికి వచ్చింది.
పదో తరగతికే ప్రేమ.. మందలించిన తల్లి.. ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన కూతురు
తల్లిని శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న తేజశ్రీ, తన ప్రియుడితో కలిసి ఒక పథకాన్ని రచించింది. సోమవారం (జూన్ 23) సాయంత్రం నల్గొండ నుంచి ప్రియుడు శివను రప్పించుకుంది. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా.. తేజశ్రీ చెల్లి ట్యూషన్ నుంచి తిరిగి ఇంటికి వస్తుంటే, బాలిక ఆమెను గల్లీలోనే ఆపి, ఒక ఆంటీని తీసుకుని రమ్మంటూ పంపింది. 20 నిమిషాల తర్వాత చెల్లి ఇంటికి తిరిగి రాగా.. అప్పటికే కిచెన్లో తల్లి అంజలి స్పృహ లేకుండా పడి ఉంది.
తల్లి స్పృహ తప్పినట్లు చూసిన తర్వాత.. శివ వెనుక నుంచి ఆమెపై దాడి చేశాడు. అనంతరం శివ, అంజలి ముఖాన్ని బెడ్షీట్తో కప్పగా.. తేజశ్రీ సుత్తితో తల్లి తలపై దారుణంగా కొట్టింది. శివ తమ్ముడు యశ్వంత్ కూడా కత్తితో అంజలి పీక కోశాడు. గొంతు నులిమి, తలపై సుత్తితో కొట్టి, కత్తితో పీక కోసి అత్యంత క్రూరంగా హత్య చేసిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa