హైదరాబాద్లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ కు అత్యంత విలువైన ప్రాంతంలో చేసిన భూ కేటాయింపులను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీఓలను కొట్టివేస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.హైదరాబాద్లోని శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో గల సర్వే నెంబరు 83/1లో 3.5 ఎకరాలకు పైగా భూమిని ఐఏఎంసీకి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ కారిడార్లో ఉన్న ఈ భూమి విలువ సుమారు రూ. 350 కోట్లు ఉంటుందని అంచనా. అయితే, ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేట్ సంస్థకు కేటాయించడం చట్టవిరుద్ధమని న్యాయవాది కె. రఘునాథ్రావు, వెంకటరామ్రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు.జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ కె. సుజనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. న్యాయవాది రఘునాథ్రావు వాదనలు వినిపిస్తూ, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా, నిబంధనలను అతిక్రమించి ప్రభుత్వం ఈ కేటాయింపులు జరిపిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.మరోవైపు, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) వాదనలు వినిపించారు. హైదరాబాద్లో ఐఏఎంసీ ఏర్పాటు వల్ల అంతర్జాతీయ వాణిజ్య వివాదాల పరిష్కారం సులభతరం అవుతుందని తెలిపారు. న్యాయస్థానాల వెలుపల వివాదాలు పరిష్కారమవ్వాలని కోర్టులే ప్రోత్సహిస్తున్నాయని, దీనివల్ల న్యాయవ్యవస్థపై భారం కూడా తగ్గుతుందని ఆయన తెలిపారు.ఇరుపక్షాల వాదనలు ఈ ఏడాది జనవరిలోనే ముగియడంతో, ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. తాజాగా శుక్రవారం తుది తీర్పును వెలువరిస్తూ, ఐఏఎంసీకి భూమిని కేటాయించడంతో పాటు, దాని ప్రస్తుత భవన నిర్వహణ కోసం జారీ చేసిన జీఓలను సైతం పూర్తిగా కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ఐఏఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులు రద్దయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa