అహ్మదాబాద్ విమానం ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. లండన్ వెళ్లడానికి గాల్లోకి టేకాఫ్ అయిన విమానం.. క్షణాల వ్యవధిలోనే ఓ బిల్డింగ్ మీద కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ప్రయాణికుల్లో ఒక్కరు మినహా మిగతా అందరూ చనిపోగా.. విమానం బిల్డింగ్ మీద కుప్పకూలడం వల్ల మరి కొందరు చనిపోయారు. ఈప్రమాదం తర్వాత జనాలు విమానం ఎక్కాలంటేనే భయంతో ఒణికిపోతున్నారు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యేవరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు.
ఇదిలా ఉంటే అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా హైదరాబాద్ విమానాశ్రయ ప్రాంత పరిధిలో ఉన్న కొన్ని భవనాలను కూల్చి వేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ వివరాలు..
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత విమానయాన శాఖ.. దేశంలోని అన్ని ఎయిర్పోర్టు పరిసరాల్లో ఉన్న నిర్మాణాలకు సంబంధించిన నిబంధనలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా ఎయిరోడ్రోమ్ జోన్ల పరిధిలో.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలపై చర్యలకు సిద్దమవుతుంది. ఇందుకోసం ఆయా భవనాల ఎత్తు తగ్గించేందుకు, కూల్చి వేసేందుకు రెడీ అయ్యింది.
విమాన ప్రమాదం తర్వాత పౌర విమానయాన శాఖ.. ఎయిర్ క్రాఫ్ట్ (డిమోలిషన్ ఆఫ్ ఆబ్స్ట్రక్షన్) రూల్స్ 2025 పేరిట ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. వీటిపై సూచనలు, సలహాలు, అభ్యంతరాలు ఇవ్వాల్సిందిగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను కోరింది. విమానాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకి లేకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకోబోతున్నట్లు విమానయాన శాఖ వెల్లడించింది.
ఈక్రమంలోనే తాజాగా హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్ పరిసర భవనాలపై అధికారులు దృష్టి సారించారు. బేగంపేట పరిసర ప్రాంతాల్లో.. ఎయిరోడ్రోమ్ జోన్ల పరిధిలో.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బిల్డింగుల కూల్చివేతకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత అకస్మాత్తుగా.. తమ భవనాలు కూల్చివేయడమే కాక.. తమను ఖాళీ చేయిస్తే.. ఎక్కడికి వెళ్లాలి.. ఎక్కడ తలదాచుకోవాలని అధికారులను ప్రశ్నిస్తున్నారు. తగినంత సమయం ఇచ్చి.. ఆ తర్వాత చర్యలు తీసుకుంటే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.
తాజా రూల్స్ ప్రకారం.. ఎయిరోడ్రోమ్ జోన్ పరిధిలో అడ్డంకిగా ఉన్న నిర్మాణాలు, చెట్లను తొలగించేందుకు అధికారులకు అనుమతి లభిస్తుంది. ఇక దీని ప్రకారం.. పరిమితికి మించి ఎత్తు ఉన్న భవనాల యజమానులకు ముందుగా నోటీసులు పంపిస్తారు. ఇలా నోటీసులు అందుకున్న వారు 60 రోజుల్లోగా.. బిల్డింగ్ సైజు, దాని నిర్మాణ ప్లాన్, సైట్ ప్లాన్ వంటి వివరాలను అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించి.. నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తిస్తే.. ఎత్తు తగ్గించమని యజమానులకు ఆదేశాలు జారీ చేస్తారు. 60 రోజుల్లోపు వీటిని అమలు చేయాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa