హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్లో వాహనదారుల ట్రాఫిక్ కష్టాలకు ఉపశమనం కలిగిస్తూ మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. కొండాపూర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు నిర్మించిన పీజేఆర్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం లాంఛనంగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.ఈ కొత్త ఫ్లైఓవర్ నిర్మాణంతో హైదరాబాద్లో అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. మొత్తం 1.2 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో ఆరు వరుసలుగా ఈ ఫ్లైఓవర్ను ఆధునిక ప్రమాణాలతో నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్, హఫీజ్పేట్ మార్గాల్లో ప్రయాణించే వారికి ప్రయాణ సమయం గణనీయంగా ఆదా అవుతుంది.ముఖ్యంగా హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రధాన వాణిజ్య ప్రాంతాలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. కొండాపూర్, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు ఇకపై ఎలాంటి ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా నేరుగా ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకోవచ్చు. దీనివల్ల ఐటీ ఉద్యోగులు, స్థానిక నివాసితులు, విమానాశ్రయ ప్రయాణికులకు ఎంతో మేలు జరగనుంది.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa