ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిర్యాదు అందిన 3 గంటల్లోనే పార్కును కాపాడిన హైడ్రా అధికారులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 28, 2025, 08:42 PM

హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను కట్టడి చేసేందుకు అలానే చెరువులు, బఫర్ జోన్‌లోని జాగాలు, నాళాలను కబ్జాల బారి నుంచి కాపాడటం కోసం రేవంత్ సర్కార్ హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చింది. ప్రారంభమైన మొదటి రోజు నుంచే హైడ్రా దూకుడుగా ముందుకు సాగుతూ.. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. అక్రమ నిర్మాణాలు, కబ్జాలకు పాల్పడే వారి పట్ల హైడ్రా సింహ స్వప్నంగా మారిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హైడ్రా చర్యల పట్ల నగరవాసులు హర్షం వ్యక్తం చేయడమే కాక.. మద్దతుగా నిలుస్తున్నారు. ఫిర్యాదు అందితే చాలు వెంటనే రంగంలోకి దిగి.. దాన్ని పరిష్కరిస్తుంది హైడ్రా. ఈ క్రమంలో హైడ్రా పని తీరుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఫిర్యాదు అందిన మూడు గంటల్లోగా పార్కును కాపాడింది హైడ్రా. ఆ వివరాలు..


ఫిర్యాదు అందిన 3 గంటల్లోనే పార్కును కాపాడిన హైడ్రా తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ, జీడిమెట్ల గ్రామంలో.. సర్వే నంబర్ 218, 214లో ఉన్న రుక్మిణి ఎస్టేట్స్‌కు చెందిన పార్కును హైడ్రా కాపాడింది. మొత్తం పార్కు విస్తీర్ణం సుమారు 1200 గజాలుగా ఉంటే.. తప్పుడు పత్రాలతో సగానికి పైగా దాన్ని కబ్జా చేశారు. గతంలో ఎన్ని సార్లు దీని గురించి అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది.


ఈ క్రమంలో హైడ్రా వ్యవస్థ వచ్చిన తర్వాత.. పార్కులో ఉన్న ఈ కబ్జాలు తొలగించాలని కుత్బుల్లాపూర్ రుక్మిణి ఎస్టేట్స్ రెసిడెన్షియల్ ఓనర్స్ అసోసియేషన్ హైడ్రా కార్యాలయానికి వచ్చి కమిషనర్ ఏవీ రంగనాథ్‌కి ఫిర్యాదు చేశారు. పార్కు ఎలా కబ్జాకు గురయ్యిందో వివరించారు. వారి ఫిర్యాదు అందుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెంటనే స్పందించారు. జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్‌కి ఫోన్ చేసి.. పార్కులో ఉన్న ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. పార్కు కబ్జా గురించి శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఫిర్యాదు అందితే.. సాయంత్రానికే సిబ్బందితో కలసి రంగంలోకి దిగిన హైడ్రా.. పార్కులో ఉన్న ఆక్రమణలను తొలగించింది.


అంతటితో ఆగక.. వెంటనే పార్కు చుట్టూ ప్రహరీ గోడను నిర్మించింది. ఫిర్యాదు చేసిన 3 గంటల్లోనే సమస్యను పరిష్కరించడంతో ఈ ప్రాంత వాసులు హైడ్రా పని తీరుపై ప్రశంసలు కురిపించారు. మరుసటి రోజు అనగా శనివారం ఉదయం పార్కులోకి వచ్చిన పరిసర ప్రాంత ప్రజలు ప్రహరీ గోడ చూసి ఊపిరి పీల్చుకున్నారు. ఆ పక్కనే ఈ పార్కును హైడ్రా కాపాడుతుంది అంటూ ఏర్పాటు చేసిన బోర్డును చూసి మురిసిపోయారు. హైడ్రా చర్యలను అభినందించారు. హైడ్రాను ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇతర సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa