ట్రెండింగ్
Epaper    English    தமிழ்

40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల కలను ప్రధాని మోదీ నెరవేర్చారని వెల్లడి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 29, 2025, 05:34 PM

తెలంగాణ పసుపు రైతులు నాలుగు దశాబ్దాలుగా కంటున్న కలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం నిజం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం నాడు నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఆయన వినాయక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రైతుల అభ్యున్నతికి, పసుపు రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు."పసుపు పంటకు నిజామాబాద్ ఒక రాజధాని లాంటిది. అలాంటి చోట నా చేతుల మీదుగా పసుపు బోర్డును ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని అమిత్ షా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణకు పసుపు బోర్డును సాధించడం కోసం బీజేపీ ఎంపీలు ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. వారి పోరాట ఫలితంగానే బోర్డును ఏర్పాటు చేయడమే కాకుండా, దానికి ఛైర్మన్‌గా తెలంగాణకు చెందిన వ్యక్తినే నియమించామని ఆయన తెలిపారు.నిజామాబాద్ పసుపుకు ప్రపంచ మార్కెట్లో గొప్ప పేరుందని, దాని ప్రాధాన్యతను మరింత పెంచాల్సిన అవసరం ఉందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. పసుపు కేవలం ఒక పంట కాదని, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ క్యాన్సర్ గుణాలున్న ఒక దివ్య ఔషధమని ఆయన కొనియాడారు. "2030 సంవత్సరం నాటికి ఒక బిలియన్ డాలర్ల సుమారు రూ. 8,300 కోట్లు విలువైన పసుపు ఉత్పత్తులను భారతదేశం నుంచి ఎగుమతి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం" అని ఆయన స్పష్టం చేశారు.ఈ బోర్డు ద్వారా రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణ అందిస్తామని, తద్వారా దిగుబడి, నాణ్యత పెంచేందుకు తోడ్పడతామని అమిత్ షా వివరించారు. నిజామాబాద్ పసుపునకు ప్రత్యేక గుర్తింపు కోసం ఇప్పటికే జియో ట్యాగింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించామని వెల్లడించారు. భారత్ కో-ఆపరేటివ్ సొసైటీల ద్వారా రైతులు ఆర్థికంగా మరింత ప్రయోజనం పొందేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఎంపీలు ధర్మపురి అర్వింద్‌, డాక్టర్ కె. లక్ష్మణ్‌, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్‌ కేతిరెడ్డి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa