ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహాకూటమితో పొత్తుకు సిద్ధమన్న ఒవైసీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 30, 2025, 05:15 PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహాకూటమితో పొత్తు కోసం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.బీహార్ రాష్ట్ర ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమామ్ నేతృత్వంలో ఎన్నికల ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఒవైసీ తెలిపారు. బీజేపీ, ఎన్డీఏలను కట్టడి చేసేందుకు మహాకూటమితో కలిసి పనిచేయాలని భావిస్తున్నామన్నారు. ముఖ్యంగా తమ పార్టీకి క్రియాశీల కార్యకర్తల బలం అధికంగా ఉన్న సీమాంచల్ ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వివరించారు. గతంలో కూడా ఎన్డీఏను నిలువరించడానికి తీవ్రంగా ప్రయత్నించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.అయితే, పొత్తుల విషయంలో మహాకూటమి పార్టీలు ముందుకు రాని పక్షంలో తమ ప్రణాళిక భిన్నంగా ఉంటుందని ఒవైసీ తేల్చిచెప్పారు. పొత్తులు కుదరకపోతే, బీహార్‌లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మజ్లిస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.ఇదే సమయంలో, బీహార్‌లో 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' పేరుతో చేపడుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిబంధనల వల్ల వేలాది మంది నిరుపేదలు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. ముఖ్యంగా సీమాంచల్ వంటి ప్రాంతాల్లో వరదల కారణంగా సర్వం కోల్పోయి అనేక కుటుంబాలు వలస వెళ్తుంటాయని అన్నారు. అలాంటి నిరుపేదలను ఓటరుగా నమోదు కావడానికి బర్త్ సర్టిఫికెట్, నివాస ధ్రువపత్రంతో పాటు తల్లిదండ్రుల నివాస పత్రాలు కూడా చూపాలని అడగడం సరికాదని ఆయన అన్నారు. ఈ కఠిన నిబంధనల వల్ల పేదలు తమ ఓటు హక్కుకు దూరమవుతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa