ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాశమైలారం ఘటనలో 12కి చేరిన మృతులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 30, 2025, 06:21 PM

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో సంభవించిన భారీ పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. సుమారు 30 మందికిపైగా గాయపడ్డారు. పేలుడు సంభవించిన భవనం, శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.


ఇవాళ ఉదయం సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న భవనం పూర్తిగా కూలిపోయింది. పక్కనే ఉన్న మరో భవనానికి కూడా బీటలు వచ్చాయి. ప్రమాద సమయంలో పరిశ్రమలో మొత్తం 108 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఈ పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలంలోనే ఐదుగురు కార్మికులు మృతి చెందగా, మరో ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల్లో మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని.. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని వైద్యులు తెలిపారు. వెలికితీసిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.


ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రమాద బాధితుల వివరాల కోసం 08455276155 నంబర్‌ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.


పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై త్వరలోనే ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి వివేక్ హామీ ఇచ్చారు. అధిక పని గంటలపై కార్మికులు ఫిర్యాదు చేస్తే లేబర్ కమిషన్ దర్యాప్తు చేస్తుందని పేర్కొన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ.. ఈ ఘటనను దురదృష్టకరమని అన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత అన్ని విభాగాల అధికారులు సత్వరమే స్పందించారని.. ప్రమాదానికి గల కారణాలను ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ఈ పరిశ్రమ 40 ఏళ్లుగా పని చేస్తోందని, మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ పౌడర్‌ను ఇక్కడ తయారు చేస్తారని ఆయన వివరించారు.


పరిశ్రమలో ఇంకా పలువురు కార్మికులు చిక్కుకుపోయారన్న అనుమానంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తమ వారి ఆచూకీ చెప్పాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. కార్మికుల కుటుంబాల రోదనలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. ఈ ఘటన పారిశ్రామిక భద్రత ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రభుత్వం, పరిశ్రమల యాజమాన్యాలు భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa