ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ బీసీ వ్యతిరేకి అని మరోసారి రుజువైందన్న మంత్రి పొన్నం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 30, 2025, 07:57 PM

బీజేపీ మరోసారి తన బీసీ వ్యతిరేక వైఖరిని స్పష్టంగా బయటపెట్టుకుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా చేయడంపై ఆయన స్పందిస్తూ, ఆ పార్టీని ఒక ఫ్యూడల్ పార్టీగా అభివర్ణించారు. ఈ మేరకు సోమవారం ఆయన తన 'ఎక్స్' ఖాతా ద్వారా బీజేపీపై విమర్శలు చేశారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఒక బీసీ నాయకుడు నామినేషన్ వేయడానికి ప్రయత్నిస్తే, ఆయనను నిరంకుశంగా అడ్డుకున్నారని పొన్నం ఆరోపించారు. నామినేషన్‌కు మద్దతు తెలిపిన వారిని సైతం భయభ్రాంతులకు గురిచేయడం బీజేపీ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని ఆయన అన్నారు."ముగ్గురు బీసీ ఎంపీలు, ఎందరో సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ, బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వడానికి బీజేపీకి మనసొప్పలేదు. గతంలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి, కనీసం శాసనసభాపక్ష నేతగా కూడా అవకాశం ఇవ్వలేదు" అని పొన్నం విమర్శించారు. బీజేపీలో బీసీలకు ఎప్పటికీ న్యాయం జరగదని, ఆ పార్టీ నేతలే ఈ విషయంపై వాపోతున్నారని, దీనికి బీజేపీ అధిష్టానం ఏం సమాధానం చెబుతుందని ఆయన ప్రశ్నించారు.సోమవారం జరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎమ్మెల్యే రాజా సింగ్ తన మద్దతుదారులతో కలిసి నాంపల్లిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అయితే, తన అనుచరులను బెదిరించారని, నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఆయన పార్టీకి తన రాజీనామాను ప్రకటించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఆ పార్టీలోని కొందరు పెద్దలకే ఇష్టం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తమ పార్టీలో ముఖ్యమంత్రి రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి అయితే, పీసీసీ అధ్యక్షుడిగా బీసీ నేతకు అవకాశం కల్పించామని గుర్తుచేశారు. "మేము కుల గణన చేపట్టి, బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టం చేశాం. కానీ బీజేపీ మాత్రం బీసీల గొంతు కోస్తోంది" అని ఆయన విమర్శించారు. గతంలో బీసీ నేత బండి సంజయ్‌ను కీలకమైన ఎన్నికల సమయంలో అధ్యక్ష పదవి నుంచి తొలగించిన విషయాన్ని కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ బీసీల పక్షాన నిలుస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు న్యాయం చేసేది ఒక్క కాంగ్రెస్ పార్టీయేనని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa