సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటన మరవక ముందే హైదరాబాద్ నగరంలోని మరో పారిశ్రామిక వాడలో ప్రమాదం చోటు చేసుకుంది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామిక వాడలో ఉన్న ఆల్కలైడ్స్ బయో అక్టీవ్స్ ఫార్మా కంపెనీలో బాయిలర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో షాపూర్కు చెందిన గన్నారం శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గత 12 ఏళ్లుగా అదే కంపెనీలో పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే తోటి కార్మికులు శ్రీనివాస్ రెడ్డిని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నగరంలోని AIG ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అక్కడ చికిత్స అందుతోంది. ఈ ఘటనపై శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, కంపెనీలో భద్రతా నిబంధనల అమలుపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇక సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో సోమవారం (జూన్ 30) ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రియాక్టర్ పేలుడు దుర్ఘటనలో 40 మందికి పైగా కార్మికులు మరణించారు. వీరిలో చాలా మంది మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. సుమారు 47 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మూడంతస్తుల ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేటివ్ భవనాలు పూర్తిగా కుప్పకూలాయి. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీ లోపల 100కు పైగా కార్మికులు విధుల్లో ఉన్నట్లు అంచనా. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. ప్లాంట్లోని డ్రైయింగ్ యూనిట్లో ఒత్తిడి పెరగడం లేదా కెమికల్ ప్రాసెస్లో వేడిని నియంత్రించే యంత్రాల పనితీరు మందగించడం వల్ల ఈ భారీ పేలుడు సంభవించిందని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే 11 అగ్నిమాపక యంత్రాలతో పాటు, ఎన్డీఆర్ఎఫ్, హెడ్రా, రెవెన్యూ, పోలీసు బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే పనులు ఇంకా కొనసాగుతున్నాయి. గాయపడిన 34 మందికి పైగా కార్మికులకు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఘటన స్థలాన్ని పరిశీలించి, మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు కంపెనీ యాజమాన్యం నుంచి రూ. కోటి నష్టపరిహారం ఇప్పిస్తామని, తీవ్ర గాయాలైన వారికి రూ.10 లక్షలు, స్వల్ప గాయలైన వారికి రూ.5 లక్షలు ఇప్పిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా మృతులకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల ఎక్స్-గ్రేషియా ప్రకటించింది. గుర్తుపట్టలేని మృతదేహాలను డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించి, బంధువులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa