వివాహ ధృవీకరణ పత్రం (మ్యారేజ్ సర్టిఫికేట్) అనేది ఒక చట్టబద్ధమైన, ముఖ్యమైన పత్రం. 2006లో సుప్రీంకోర్టు వివాహ నమోదును తప్పనిసరి చేసింది. భార్యాభర్తల మధ్య సంబంధానికి ఇది బలమైన రుజువు. వారసత్వం, ఆస్తి హక్కులు, పిల్లల సంరక్షణ వంటి విషయాలలో ఇది చాలా ముఖ్యమైనది. పెళ్లి తర్వాత ఆరోగ్య బీమా, సామాజిక భద్రతా ప్రయోజనాలు, పన్ను ప్రయోజనాలు, పెన్షన్ వంటి వాటిని పొందడానికి ఇది అవసరం. విదేశాలకు వెళ్లడానికి లేదా ఇతర దేశాలలో నివాసం కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు, ముఖ్యంగా స్పౌస్ వీసా కోసం వివాహ ధృవీకరణ పత్రం తప్పనిసరి.
ప్రస్తుతం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వివాహాన్ని రిజిస్ట్రర్ చేసి సర్టిఫికేట్ జారీ చేస్తున్నారు. అయితే అందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లటం, స్లాట్ బుక్ చేసుకోవటం వంటి వాటి వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక నుంచి ఆ టెన్షన్ అక్కర్లలేదు. చాలా ఈజీగా మ్యారేజ్ సర్టిఫికేట్ పొందవచ్చు. డిజిటల్ గవర్నెన్స్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో మీ-సేవ కేంద్రాల ద్వారా వివాహ రిజిస్ట్రేషన్తో పాటు భూముల మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమవారం (జూన్ 30) నాడు ఈ కొత్త సేవల కోసం స్లాట్ బుకింగ్ వ్యవస్థను ప్రారంభించారు.
మ్యారేజ్ సర్టిఫికేట్ పొందడానికి రూ. 200 రుసుముతో మీ సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వధూవరుల వివాహ ఫోటోలు, ఆధార్ కార్డులు, వయస్సు ధ్రువీకరణ పత్రాలు, ముగ్గురు సాక్షుల ఆధార్ వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి. ఈ పత్రాలన్నీ అప్లోడ్ చేసి వాటిని పరిశీలించిన తర్వాత అధికారులు వివాహ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు.
ఇకపై వివాహ ధృవీకరణ పత్రాన్ని (మ్యారేజ్ సర్టిఫికెట్) మీ-సేవ ద్వారా కూడా పొందవచ్చు. దరఖాస్తుదారులు వివాహ ఫోటోలు, చిరునామా రుజువు, వయస్సు ధ్రువీకరణ పత్రాలను సమర్పించి దరఖాస్తు చేసుకుంటే సబ్-రిజిస్ట్రార్ ఆఫీసు (SRO) నుంచి మ్యారేజ్ సర్టిఫికెట్ను నేరుగా జారీ చేస్తారు. ఇది వివాహ నమోదు ప్రక్రియను సరళీకృతం చేయటంతో పాటుగా నూతన వధూవరులకు సమయాన్ని కూడా ఆదా చేస్తుంది.
ఇదే కాకుండా ఏదైనా భూమికి సంబంధించిన తాజా మార్కెట్ విలువను పొందడానికి ఇకపై మీ-సేవ లేదా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులో జిల్లా, గ్రామం వంటి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను సంబంధిత సబ్- రిజిస్ట్రార్ కార్యాలయం 24 గంటల్లోనే పరిశీలించి మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ను జారీ చేస్తుంది. ఈ సదుపాయం నిర్మాణ రంగం, స్థిరాస్తి వ్యాపారులకు, అలాగే భూమి కొనుగోలుదారులు, విక్రేతలకు ఎంతో ఉపయోగపడనుంది. ఇది పారదర్శకతను పెంచి, అనవసరమైన జాప్యాన్ని తగ్గిస్తుంది.
సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ తాజా సేవలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర డిజిటల్ గవర్నెన్స్లో ఇదొక కీలక అడుగు. ఇప్పటికే మీ-సేవలో ఆర్టీఏ (రవాణా శాఖ), పాన్ (పాన్ కార్డులు), ఇసుక బుకింగ్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి, టీ-ఫైబర్ నెట్వర్క్ను విస్తరించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అదనపు మీ-సేవ కియోస్క్లను కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa