హెచ్ఐవీ బాధితులకు అండగా నిలిచేందుకు రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా బాధితులకు పెన్షన్లు మంజూరు చేశారు. మెుత్తం 14,084 మంది హెచ్ఐవీ బాధితులకు కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఫైల్పై సంతకం చేశారు. ఈనెల (జూలై) నుంచే లబ్ధిదారులు పింఛన్లు అందుకోనున్నారు. ఈ నిర్ణయం వారి వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించి, జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 34,421 మంది హెచ్ఐవీ బాధితులకు నెలకు రూ.2,016 చొప్పున పెన్షన్ అందుతోంది. ఇందుకోసం ప్రభుత్వం నెలకు రూ.6.93 కోట్లు ఖర్చు చేస్తోంది. 2022 ఆగస్టు తర్వాత ఈ కేటగిరీలో కొత్త దరఖాస్తులను ఆమోదించలేదు. దీంతో బాధితులు ఇటీవల మంత్రి సీతక్కను కలిసి తమకు పెన్షన్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. వారి విజ్ఞప్తికి స్పందించిన మంత్రి, తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి (TGSACS) ధ్రువీకరణ ఆధారంగా కొత్తగా 14,084 మందికి పెన్షన్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. వీరికి ఈ నెల నుంచే రూ.2,016 చొప్పున పెన్షన్ అందించనున్నారు.
ఈ కొత్త పెన్షన్ల మంజూరుకు ఈ ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.28.40 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సెర్ప్ (SERP) వర్గాలు వెల్లడించాయి. కొందరు హెచ్ఐవీ బాధితులు పూర్తిస్థాయిలో పనిచేయలేని స్థితిలో ఉండటం, వారికి నెలనెలా వైద్య ఖర్చులు ఆర్థిక భారాన్ని మోపుతుండటాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పేదరికంతో బాధపడుతున్న హెచ్ఐవీ బాధితులకు చేయూత పథకం కింద ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది.
2022 ఆగస్టు తర్వాత హెచ్ఐవీ కేటగిరీలో కొత్త పింఛన్ల మంజూరు నిలిచిపోయింది. తాజాగా, తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (TGSACS) ఆధ్వర్యంలో కొత్తగా నమోదైన 14,084 మందికి అర్హతలు నిర్ధారించిన అనంతరం సెర్ప్ (SERP) ద్వారా పింఛన్లు మంజూరు అయ్యాయి. అయితే, కొన్ని జిల్లాల్లో కొత్తగా ఒక్కరు కూడా హెచ్ఐవీ బాధితులు నమోదు కాలేదని నివేదికలు చెబుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, గద్వాల, మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్కర్నూల్, నారాయణపేట, నిర్మల్, రంగారెడ్డి జిల్లాల్లో కొత్తగా ఒక్కరూ నమోదు కాలేదు.
కొత్తగా లబ్ధి పొందుతున్న హెచ్ఐవీ బాధితుల జిల్లా వారీ వివరాలు
హైదరాబాద్: 3,019 మంది, నల్గొండ: 1,388 మంది, ఖమ్మం: 954 మంది, సూర్యాపేట: 931 మంది, కరీంనగర్: 833 మంది, హనుమకొండ: 825 మంది, కామారెడ్డి: 702 మంది, పెద్దపల్లి: 567 మంది, భద్రాద్ర కొత్తగూడెం: 556 మంది, వికారాబాద్: 544 మంది, సిద్దిపేట: 527 మంది, నిజామాబాద్: 528 మంది, మహబూబ్నగర్: 452 మంది, ఆదిలాబాద్: 482 మంది, జగిత్యాల: 306 మంది, జనగామ: 228 మంది, సంగారెడ్డి: 1,242 మంది కొత్తగా హెచ్ఐవీ పెన్షన్లు పొందేందుకు అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa