వర్షాకాలం నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోడానికి హైడ్రా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. 150 మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్లను రంగంలోకి దించింది. ఒక్కో షిఫ్టులో నలుగురు చొప్పున మూడు షిఫ్టుల్లో పని చేస్తారు. ఇలా 150 మాన్సూన్ ఎమర్జన్సీ బృందాల్లో మొత్తం 1800ల మంది ఉంటారు. వర్షపు నీరు నిలిచే (368 స్టాటిక్ టీమ్లు) చోట రెండు షిఫ్టుల్లో పని చేసేలా 734 మంది సిద్ధమయ్యారు. వీరికి తోడు హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు 51 వర్షాకాలం పనుల్లో నిమగ్నమయ్యాయి. ఒక్కో టీమ్లో 18 మంది ఉంటారు. ఇలా డీఆర్ ఎఫ్ సిబ్బంది 918 మంది సేవలందిస్తారు. వీరు ఒక్కో షిఫ్టుల్లో ఆరుగురు చొప్పున పని చేస్తారు. వీరికి తోడు ఎమర్జన్సీ బైకు బృందాలు 21 ఉన్నాయి. ఒక్కో బైకుపైన ఇద్దరు చొప్పున మొత్తం 42 మంది పని చేస్తారు. 30 సర్కిళ్లలో పనులను పర్యవేక్షించేందుకు హైడ్రాకు చెందిన మార్షల్స్ 30 మంది ఉంటారు. ట్రాఫిక్ పోలీసులతో కలసి పని చేసేందుకు రెండు షిప్టుల్లో కలిపి 200ల మందితో 20 బృందాలు, చెట్టుకొమ్మలు, చెత్తను ఎత్తుకెళ్లేందుకు వీలుగా.. ఒక్కో షిప్టులో ముగ్గురు చొప్పున ఉండేలా 240 మంది అందుబాటులో ఉంటారు. ఇలా అధికారులతో కలిపి వర్షాకాలం ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు మొత్తం 4100 మంది సేవలందిస్తారు.
వర్షం ఎప్పుడు వస్తుందో ఎంత మొత్తంలో పడుతుందో అంచనా వేయలేని పరిస్థితుల్లో మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్(ఎంఈటీ)లు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్గారు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. వర్షానికి ముందే రహదారుల్లో నీరు వెళ్లేందుకు ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. నాలాలను, కల్వర్టులను పరిశీలించి.. వరద నీటి ప్రవాహం సాఫీగా సాగేలా జాగ్రత్తపడాలన్నారు. ఎక్కడ నీరు నిలుస్తుందో ముందుగానే ఒక అంచనాకు వచ్చి.. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. చెట్లు పడిపోతే వెంటనే వాటిని తొలగించాలి. హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు కూడా సహకరిస్తాయని.. సమన్వయంతో పని చేయాల్సినవసరం ఉందని చెప్పారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆయా ప్రాంతాల హైడ్రా ఎస్ఫ్వోలకు తెలయిజేయడమే కాకుండా.. ఆ సమాచారాన్ని హైడ్రా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
వరద నీరు నిలిచిన వెంటనే తోడేందుకు నీటి పంపులు, చెట్లు పడిపోతే తొలగించడానికి కటింగ్ మెషిన్లు, చెత్తను తొలగించడానికి అవసరమైన పరికరాలన్నీ 150 స్టాటిక్ బృందాలతో పాటు.. 51 డీఆర్ఎఫ్ బృందాలకు అప్పగించారు. వర్షాకాలంలో పని చేసే ఈ బృందాలన్నిటికీ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి సేవల తీరును వివరించారు. ఈ బృందాలన్నీ ఆయా డివిజన్లలో ఉండి సేవలందిస్తాయి. ఆ డివిజన్ వరకూ ఎక్కడా ఇబ్బంది ఉన్నా వీరు బాధ్యతపడి.. సమస్యను పరిష్కరిస్తారు. ట్రాఫిక్ సాఫీగా సాగేలా ట్రాఫిక్ పోలీసులతో 20 బృందాలు పని చేస్తాయి. అలాగే చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేందుకు తగిన వాహనాలను, పని ముట్లును కూడా హైడ్రా సమకూర్చింది. మొత్తం 242 మంది ఈ విధుల్లో ఉంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa