తెలంగాణ ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 22 లక్షల మంది రైతులు ఖాతాల్లో రూ. 25 వేల కోట్లకు పైగా జమ చేశారు. మెుత్తం నాలుగు విడతల్లో రైతుల ఖాతాల్లో సర్కార్ నిధులు విడుదల చేసింది. తాజాగా.. చేనేత కార్మికులకు సైతం రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. రూ. లక్ష రూపాయల వరకు రుణమాఫీ అమలుకు సిద్ధమైంది. అందకు అవసరమైన రూ. 33 కోట్లను మంజూరు చేస్తూ మంగళవారం (జులై 1) ఉత్తర్వులు జారీ చేశారు.
చేనేత రుణమాఫీ పథకం కింద 2017 ఏప్రిల్ 1 నుండి 2024 మార్చి 31 వరకు చేనేత కార్మికులు వివిధ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో వ్యక్తిగతంగా తీసుకున్న రుణాలకు (అసలు, వడ్డీతో కలిపి) మాఫీ వర్తిస్తుంది. చేనేత వస్త్రాల ఉత్పత్తి, నిర్వహణ మూలధనం, మరియు ఇతర వృత్తి సంబంధిత కార్యకలాపాల కోసం తీసుకున్న రుణాలు దీని పరిధిలోకి వస్తాయి. రుణమాఫీ అమలు కోసం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. చేనేత సంచాలకుడి (డైరెక్టర్) అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కమిటీని సైతం ఏర్పాటు చేశారు.
జిల్లా కమిటీ నుండి వచ్చిన ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదించిన తర్వాత, రుణమాఫీ మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. తర్వాత బ్యాంకర్లు ఎలాంటి బకాయిలు లేవని (నో డ్యూస్) ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు. రుణమాఫీ అనంతరం అర్హులైన కార్మికులు కోరుకుంటే బ్యాంకులు తిరిగి వారికి రుణాలు మంజూరు చేస్తాయి. అయితే ప్రస్తుతం చేనేత కార్యకలాపాల్లో లేని లేదా వారి ఖాతాలు నిరర్థక ఆస్తుల ఖాతా (ఎన్పీఏ) కింద ఉన్న కార్మికులకు తిరిగి రుణాలు లభించవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం తెలంగాణలోని చేనేత కార్మికులకు గణనీయమైన ఆర్థిక ఉపశమనాన్ని అందించి, వారి జీవనోపాధికి తోడ్పడుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa