ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనర్హులని తేలితే ఇండ్లు రద్దు,,,మంత్రి పొంగులేటి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 02, 2025, 11:36 PM

పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొత్తంగా తొలి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ పరిధిలోని చెంచు గిరిజన కుటుంబాలకు అదనంగా 10 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. పట్టణ ప్రాంతాలు, GHMC పరిధిలో G+3 అపార్ట్‌మెంట్ల నిర్మాణంపై దృష్టి సారించారు. ఇప్పటికే 16 స్లమ్ ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజల డిమాండ్‌ మేరకు అక్కడే నివాస సముదాయాలు నిర్మించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.


 అయితే చాలా ప్రాంతాల్లో అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ పథకంలో పారదర్శకతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, అనర్హులు అని తేలితే ఇందిరమ్మ ఇళ్లు రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని, ఇందులో ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా సమర్థవంతంగా ముందుకు వెళ్తోందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ నేపథ్యంలో ఒక్కో ఇందిరమ్మ ఇంటికి ఉచితంగా 40 మెట్రిక్ టన్నుల ఇసుక అందేలా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.


అలాగే, స్టీలు, ఇసుక, సిమెంట్ ధరలను నియంత్రించడానికి మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల మంజూరు, నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యత పూర్తిగా జిల్లా కలెక్టర్లదేనని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో ఎవరైనా అనర్హులని తేలితే, ఇల్లు నిర్మాణం ఏ దశలో ఉన్నా కూడా రద్దు చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్లను అత్యంత పారదర్శకంగా మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రతి సోమవారం నిర్మాణ పురోగతిని బట్టి నిధులు విడుదల చేస్తున్నామని ఇప్పటివరకు రూ. 98.64 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు.


కాగా, ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నారు. రూ. 5 లక్షల ఆర్థిక సహాయం నాలుగు దశల్లో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. పునాది పూర్తయిన తర్వాత రూ. 1 లక్ష, గోడలు పూర్తయ్యాక రూ. 1.25 లక్షలు, స్లాబ్ దశలో రూ. 1.75 లక్షలు, మిగిలిన పనులు పూర్తయిన తర్వాత రూ. 1 లక్ష అందిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa