ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతన్నలనూ వదలని సైబర్ నేరగాళ్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 03, 2025, 05:54 PM

సైబర్ మోసగాళ్లు ఇటీవల కాలంలో వివిధ రకాల మార్గాలను అనుసరిస్తున్నారు. వారు పాటించే టెక్నాలజీ ఎవరికీ అంతు చిక్కకుండా జాగ్రత్త పడుతూ దొంగతనాలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పట్టణాల్లోని ఆర్థిక పరంగా మంచి స్థితిలో ఉన్న వాళ్లను, ఉద్యోగాలు చేసుకుంటూ బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటెన్స్ చేసే వారిని టార్గెట్ చేసిన నేరగాళ్లు రూటు మార్చారు. రైతులను టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇలా వారు నిరంతరం కొత్త పద్ధతులను అన్వేషిస్తూ.. తాజాగా పీఎం కిసాన్ యాప్ పేరుతో సోషల్ మీడియాలోకి ప్రవేశించారు. రైతులు ఈ నకిలీ సమాచారాన్ని విశ్వసించి క్లిక్ చేస్తే.. వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు అదృశ్యం కావడం ఖాయం. అప్రమత్తంగా లేకపోతే.. కష్టపడి సంపాదించిన సొమ్ము క్షణాల్లో గల్లంతు అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది.


పీఎం కిసాన్ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకుంటే కేంద్రం నుంచి నేరుగా రూ.6,000 ఖాతాలో జమ అవుతాయని సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా సంస్థలు, ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు పోస్టులు పెడుతున్నారు. అవగాహన లేని అమాయకులు వీటిని నమ్మి క్లిక్ చేయడం ద్వారా తమ డబ్బును కోల్పోతున్నారు. ఇటీవల గట్టు మండలంలో ఒక రైతు ఇలాంటి యాప్‌ను క్లిక్ చేసి నిమిషాల వ్యవధిలో రూ.64,500 పోగొట్టుకున్నారు. వెంటనే తన ఖాతాను పరిశీలించుకోగా.. సైబర్ నేరగాళ్లు సొమ్మును బదిలీ చేసుకున్నట్లు గుర్తించి గట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ప్రభుత్వం రైతు భరోసా నిధిని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తున్న నేపథ్యంలో.. సైబర్ నేరగాళ్ల దృష్టి రైతులపై పడింది. నకిలీ యాప్‌లను గుర్తించే అవగాహన లేకపోవడంతో రైతులు సులభంగా లక్ష్యంగా మారుతున్నారు. ఇటీవల తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎస్‌బీఐ, పీఎం కిసాన్, ఇతర బ్యాంకుల పేరుతో నకిలీ అప్లికేషన్ అప్‌డేట్ చేసుకోవాలంటూ సామాజిక మాధ్యమ గ్రూపుల్లో తరచుగా సందేశాలు కనిపిస్తున్నాయి.


వివిధ రకాల మోసాలు..


పది రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లా ధరూర్ మండలానికి చెందిన ఒక యువకుడికి ఎస్‌బీఐ ఖాతా అప్‌డేట్ చేయమని వాట్సాప్‌లో నకిలీ అప్లికేషన్ లింక్ వచ్చింది. దాన్ని అప్‌డేట్ చేయడానికి ప్రయత్నించి ఖాతాలో ఉన్న రూ.20,000 కోల్పోయాడు.


అంతే కాకుండా.. గద్వాల మండలానికి చెందిన మరో యువకుడు ఒక వివాహ పరిచయ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు నమోదు చేశాడు. అది నకిలీ అప్లికేషన్ కావడంతో అతని ఖాతాలోని డబ్బును సైబర్ నేరగాళ్లు కాజేశారు.


అరగంటలో రూ.6.5 కోట్లు ఆవిరి.. డేటింగ్ యాప్‌లో పరిచయం.. అతడిని నిండా ముంచింది..


గ్రూప్ అడ్మిన్‌లకు హెచ్చరికలు..


వాట్సాప్ గ్రూపుల అడ్మిన్‌లు అపరిచితులను చేర్చడం, వారికి అడ్మిన్ హక్కులు ఇవ్వడం వంటివి చేయడం వల్ల సైబర్ నేరగాళ్లు సులభంగా గ్రూపుల్లోకి ప్రవేశించి మోసపూరిత లింకులను పంపుతున్నారు. ఈ విషయంలో గ్రూప్ అడ్మిన్‌లు మరింత జాగ్రత్తగా ఉండాలి.


సైబర్ మోసాలపై పోలీసులు నిత్యం కళాజాత బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ.. ప్రజలు, ముఖ్యంగా రైతులు, అటువంటి నకిలీ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఏదైనా అనుమానం వస్తే వెంటనే బ్యాంకు లేదా పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు. తెలియని లింకులపై క్లిక్ చేయకుండా, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకుండా జాగ్రత్త వహించడం ద్వారా ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండవచ్చని జోగులాంబ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa