ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్వాక్రా మహిళలకు పండగలాంటి వార్త

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 04, 2025, 08:00 PM

తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘మహిళా శక్తి’ పథకం మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థికంగా గొప్ప ఊతం ఇచ్చింది. ఈ వినూత్న పథకం కింద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అద్దెకు తీసుకున్న బస్సుల ద్వారా మొదటి నెలలోనే కోటి రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది. ప్రభుత్వం మహిళా సంఘాలను బస్సులు కొనుగోలు చేయించి, వాటిని టీఎస్‌ఆర్టీసీకి అద్దెకు ఇచ్చి లాభాలు పొందేలా ఈ పథకాన్ని రూపొందించింది. ఇందుకోసం రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ పొదుపు నిధులను ఆయా సంఘాలకు సమకూర్చింది.


మార్చి 8న.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మే 20 నుంచి మహిళా సంఘాలకు చెందిన మొత్తం 151 బస్సులను టీఎస్‌ఆర్టీసీ విజయవంతంగా నడుపుతోంది. ఈ బస్సులకు డ్రైవర్లు, కండక్టర్లను టీఎస్‌ఆర్టీసీనే నియమించింది. ప్రతి బస్సుకు నెలకు రూ.69,468 చొప్పున అద్దె చెల్లిస్తోంది. మే 20 నుంచి జూన్ 20 వరకు, తొలి నెలలోనే మొత్తం రూ.1,04,89,668 అద్దె రూపంలో లభించింది. దీనికి సంబంధించిన చెక్కును టీఎస్‌ఆర్టీసీ నుంచి సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ స్వీకరించారు. గురువారం సచివాలయంలో మంత్రి సీతక్కతో దివ్యాదేవరాజన్ సమావేశమై ఈ వివరాలను వెల్లడించారు. సీతక్క.. దివ్యను, మహిళా సంఘాలను అభినందించారు. అద్దె బస్సులకు అవకాశం కల్పించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సీతక్క ఫోన్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు.


మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన తర్వాత టీఎస్‌ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనివల్ల అదనపు బస్సుల అవసరం ఏర్పడింది. మహిళా సంఘాల ద్వారా బస్సులు సమకూరడంతో టీఎస్‌ఆర్టీసీపై ఆర్థిక, నిర్వహణ భారం తగ్గింది. ప్రయాణికులకు కూడా మెరుగైన రవాణా సౌకర్యం లభించింది.


టీఎస్‌ఆర్టీసీ అందించిన అద్దె మొత్తాన్ని 150 మహిళా సంఘాలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని జూలై 5న ప్రజాభవన్‌లో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ‘మహిళా శక్తి’ పథకం కింద టీఎస్‌ఆర్టీసీకి మొత్తం 600 బస్సులు అద్దెకు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. తొలి విడతలో 151 బస్సులతో పథకం ప్రారంభం కాగా.. మిగిలిన 449 బస్సులను కూడా త్వరలో సమకూర్చాలని సెర్ప్ నిర్ణయించింది.


దీని కోసం మండల సమాఖ్యల ఎంపిక ప్రక్రియను చేపట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ బస్సులను మహిళా సమాఖ్యల ద్వారా టీఎస్‌ఆర్టీసీకి అందిస్తామని సెర్ప్ సీఈఓ దివ్య తెలిపారు. ఈ పథకం మహిళా సాధికారతకు ఒక నూతన మార్గాన్ని చూపిస్తూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa