ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 06, 2025, 06:56 PM

తెలంగాణలో తీవ్రమైన ఎరువుల కొరత నెలకొందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా కేటీఆర్ స్పందించారు. "సబ్సిడీపై రూ.266.50కి లభించాల్సిన యూరియా బస్తా ధర, ఇప్పుడు రూ.325కి ఎందుకు పెరిగింది దీనికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, ప్రజలకు సమాధానం చెప్పాలి" అని ప్రశ్నించారు. ఈ కృత్రిమ కొరతను ఎవరు సృష్టిస్తున్నారు తెర వెనుక ఉండి ఈ బ్లాక్ మార్కెట్ దందాను నడిపిస్తున్నదెవరు అని నిలదీశారు. ఆధార్ కార్డు తప్పనిసరి చేసినా రైతులకు కనీసం ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వలేని దుస్థితి ఎందుకొచ్చిందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం రైతు భరోసా, రుణమాఫీ వంటి హామీలను అమలు చేయడంలో విఫలమైందని కేటీఆర్ విమర్శించారు.మరోవైపు, ఖరీఫ్ సీజన్‌లో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. రాష్ట్రంలో 1.94 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఈ విషయంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత వారమే కేంద్రానికి లేఖ రాశారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు గాను తెలంగాణకు 5 లక్షల టన్నుల యూరియాను కేటాయించిన కేంద్రం, కేవలం 3.06 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేసిందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. తక్షణమే మిగిలిన కోటాను విడుదల చేయాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను కోరారు. అలాగే, కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు కూడా లేఖలు రాసి, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa