ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త రేషన్ కార్డులపై .. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 07, 2025, 10:36 PM

తెలంగాణ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడుతూ.. రేషన్ కార్డుల పంపిణీ విషయంలో కీలక ప్రకటన చేసింది. ఈ నెల 14వ తేదీ నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు అందించబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరగని పనులు 18 నెలల తమ ఇందిరమ్మ ప్రభుత్వంలో చేసి చూపుతున్నామని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఒక్కో హామీని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తుంటే.. ప్రతిపక్షాలు ఆరు గ్యారెంటీలపై అనవసరంగా విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు.


నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పత్రాల పంపిణీ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఉపఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చిందని.. మిగిలిన చోట్ల ఒక్క కార్డు కూడా జారీ చేయలేదని తీవ్రంగా విమర్శించారు. అయితే.. ప్రస్తుత ఇందిరమ్మ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా, పేదలందరికీ సన్నబియ్యం అందిస్తోందని.. ఇది ప్రజల దీవెనలతోనే సాధ్యమైందని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజలు మర్చిపోవద్దని, రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా తమ ప్రభుత్వానికే ప్రజల ఆశీస్సులు ఉండాలని ఆయన కోరారు.


మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ స్వలాభం కోసం తెలంగాణ రైతుల హక్కులను కాలరాస్తూ.. పక్క రాష్ట్రంతో కుమ్మక్కైంది బీఆర్ఎస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆరేనని విమర్శించారు. కేవలం కమిషన్ల కోసమే ప్రాణహిత ప్రాజెక్టును పక్కన పెట్టి, కాళేశ్వరం ప్రాజెక్టును తెరపైకి తీసుకువచ్చారని.. వారి వేసిన పునాదే ఈనాటి బనకచర్ల ప్రాజెక్టు సమస్యలకు కారణమని పేర్కొన్నారు.


తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నంతవరకు ఒక్క చుక్క నీటి బొట్టును కూడా, తెలంగాణ రాష్ట్ర హక్కులను వదులుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్నాయని.. తల తాకట్టు పెట్టైనా పేదలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేశామని.. మరో మూడు విడతలు కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వబోతున్నామని మంత్రి తెలిపారు. ఇళ్లు రాని వారు ఎవరూ నిరుత్సాహ పడవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa