ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో 34 మెడికల్ కాలేజీలకు... ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 09, 2025, 08:28 PM

తెలంగాణ రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా రాష్ట్రంలోని 4090 ఎంబీబీఎస్ సీట్లను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఒక్క కాలేజీకి కూడా మెడికల్ కమిషన్ జరిమానా విధించకపోవడం విశేషం. ఫ్యాకల్టీ కొరతను అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలను కూడా ఎన్ఎంసీ ప్రశంసించింది.


ఫ్యాకల్టీ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రమోషన్లు ఇవ్వడమే కాకుండా, 44 మంది సీనియర్ ప్రొఫెసర్లకు, అడిషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లుగా ప్రమోషన్లు కల్పించి వారందర్నీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్, టీచిగ్ హాస్పిటల్స్‌కు సూపరింటెండెంట్లుగా ఎన్ఎంసీ నియమించింది. అదేవిధంగా అసోసియేట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న 278 మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతలు కల్పించింది. ఈ ప్రమోషన్లతో అన్ని కాలేజీల్లో ప్రొఫెసర్ల కొరత, డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీల సమస్య తీరనుంది.


అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న సుమారు 231 మంది అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు ఇచ్చేందుకు ఆరోగ్యశాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అడిషనల్ డీఎంఈ వంటి పోస్టులను నేరుగా రిక్రూట్‌ చేసుకునే అవకాశం లేకపోవడంతో, ప్రమోషన్ల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తుంది. 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను నేరుగా భర్తీ చేసేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవిగాక సుమారు మరో 714 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ అంశాలన్నీ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఎన్‌ఎంసీకి వివరించారు. దీంతో ఎన్‌ఎంసీ సంతృప్తి వ్యక్తం చేసింది.


కొన్ని టీచింగ్ హాస్పిటళ్లలో బెడ్ల సంఖ్య తక్కువగా ఉందని ఎన్‌ఎంసీ లేవనెత్తింది. ఈ నేపథ్యంలో 21 టీచింగ్ హాస్పిటల్స్‌లో కలిపి సుమారు 6 వేలకుపైగా బెడ్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రతి కాలేజీ పర్యవేక్షణకు మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ)లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలు అన్ని కాలేజీల్లో పర్యటించి, కాలేజీల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.


రాష్ట్రంలో 2022 నుంచి 2024 మధ్యలో ఒకేసారి 25 కాలేజీలు ఏర్పాటైన తీరును ఎన్‌ఎంసీకి అధికారులు వివరించారు. అన్ని కాలేజీలు, వాటి అనుబంధ టీచింగ్ హాస్పిటళ్లకు భవనాలను నిర్మిస్తున్న విషయాన్ని ఎన్‌ఎంసీ తెలియజేశారు. భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన ఎన్‌ఎంసీ, అన్ని పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని.. విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. నాలుగు నెలల్లో పూర్తిస్థాయిలో అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని ఎన్‌ఎంసీ సూచించింది. మరోవైపు ఎంబీబీఎస్‌ కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు కాళోజి హెల్త్ యూనివర్సిటీ సిద్ధమవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa