కేంద్రం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నారు. కర్షక, కార్మిక సంఘాలు చేపట్టిన భారత్ బంద్కు తెలంగాణలోని సింగరేణి కార్మికులు మద్దతు తెలిపాయి. బెల్లంపల్లి, మందమర్రిలో సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో గనుల్లో పనులు నిలిచిపోయాయి. కేకే-5 గని దగ్గర ఐకే సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమ్మె వల్ల సంస్థకు ఒక్క రోజే రూ.76 కోట్ల నష్టం వచ్చింది. కార్మికులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించారు. దీంతో గనులన్నీ వెలవెలబోయాయి. అటు, హైదరాబాద్ నగరంలోనూ బంద్ ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది.
మరోవైపు, భారత్ బంద్తో పలు రాష్ట్రాల్లో ప్రజా రవాణా స్తంభించింది. రాజధాని ఢిల్లీలో డిటీసీ బస్సులు, మెట్రోపై ప్రభావం లేనప్పటికీ, ప్రైవేట్ రవాణా నిలిచిపోయింది. మహారాష్ట్రలో బంద్ కారణంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తమిళనాడులో ట్రాన్స్పోర్ట్ కార్మికులు బంద్కు మద్దతుగా సమ్మెలో పాల్గొన్నారు. కేరళ, పశ్చిమబెంగాల్, ఒడిశాలో బంద్కు భారీ స్పందన వచ్చింది. స్కూళ్లు, కళాశాలలు మూతపడ్డాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సులపై ప్రభావం తక్కువగా ఉన్నా, కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి.
‘‘ఈ బంద్ ద్వారా మేము కార్మికుల హక్కుల మీద ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన తెలుపుతున్నాం. ప్రభుత్వంతో చర్చలకు మేము సిద్ధంగా ఉన్నా, ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిబంధనలు తీసుకురావడాన్ని మేము సహించలేం’’ అని ఏఐటీయూసీ నేత ఉమేశ్ అన్నారు. కాగా, పలు రాష్ట్రాల్లో నిరసనలు అడ్డుకోడానికి భారీ పోలీస్ బలగాలను మోహరించారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, కోల్కతా వంటి మెట్రో నగరాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేశారు. పలు రాష్ట్రాల్లో బస్సులను హెల్మెట్లు పెట్టుకుని డ్రైవర్లు నడిపిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బెంగాల్లో బంద్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఎక్కడిక్కడ దుకాణాలు, మాల్స్ మూతబడ్డాయి. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. వాహనాలను అడ్డుకోడానికి ప్రయత్నించిన నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సిన వరకు పరిస్థితి వెళ్లింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa