హైదరాబాద్లోని కూకట్పల్లి హైదర్నగర్లో కల్తీ కల్లు కలకలం రేపింది. కల్తీ కల్లు తాగి 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. ఈ ఘటనపై అప్రమత్తమైన అబ్కారీ అధికారులు తక్షణమే రంగంలోకి దిగి పలు కల్లు దుకాణాలను సీజ్ చేశారు. ఆదివారం (జూలై 6) ఉదయం స్థానికంగా కల్లు తాగిన 15 మందిలో అదే రోజు ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదు. అయితే మరుసటి రోజు ఉదయం నుంచి వారిలో ఒక్కొక్కరిగా అనారోగ్య సమస్యలు బయటపడ్డాయి. బీపీ పడిపోవడం, తీవ్రమైన వాంతులు, విరేచనాలు, కొందరిలో స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వారిని హుటాహుటిన హైదర్గూడలోని రాందేవ్రావ్ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధితులకు ఆదివారం నుంచి మూత్రపిండాల పనితీరు సరిగా లేదు. దీనివల్ల కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడి, రక్తంలో క్రియాటినైన్ స్థాయులు ప్రమాదకరంగా పెరిగాయి. మెరుగైన చికిత్స, డయాలసిస్ నిర్వహణ కోసం వారందరినీ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. మృతుల వివరాల తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, మేడ్చల్ జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ ఉమ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు, ఈ కల్తీ కల్లు వ్యవహారం వెలుగులోకి రావడంతో అబ్కారీ అధికారు వేగంగా స్పందించారు. హైదర్నగర్, ఆల్విన్కాలనీ, శంషీగూడలోని మూడు కల్లు దుకాణాలను సీజ్ చేశారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, మరికొందరు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. కల్తీ కల్లు మూలాలను గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
కాగా, ఈ ఘటనపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆరా తీశారు. ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన నిమ్స్ డైరెక్టర్ బీరమ్మను ఆదేశించారు. ఇక ఈ ఘటనపై రాజకీయ రంగు పులుముకుంది. ఈ కల్లు కాంపౌండ్ ఒక కాంగ్రెస్ నాయకుడిదే అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. శేరిలింగంపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడే దీనిని నడుపుతున్నారని ఆయన వెల్లడించారు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సంఘటన కల్తీ కల్లు వ్యాపారంపై తీవ్రమైన చర్చకు దారితీసింది, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa