ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజాసింగ్ బలహీనవర్గాల నేత కనుకే రాజీనామా ఆమోదం,,,మంత్రి పొన్నం ప్రభాకర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 11, 2025, 08:35 PM

బీజేపీ హైకమాండ్.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్‌కు మద్దతుగా ప్రకటన చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. బీజేపీ బీసీలకు వ్యతిరేకం.. అందుకే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. బలహీన వర్గాల నేత కాబట్టే రాజాసింగ్ రాజీనామాను వెంటనే ఆమోదించారని మంత్రి పొన్నం విమర్శించారు.


ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇప్పుడు రాజాసింగ్ రాజీనామా ఆమోదం, గతంలో బండి సంజయ్‌ను కారణం లేకుండానే అధ్యక్ష పదవి నుంచి తొలగించడం వంటి బీజేపీ నిర్ణయాలు చూస్తే.. ఆ పార్టీ బలహీనవర్గాల వారిని పట్టించుకోదని స్పష్టం అవుతోంది. బీజేపీ.. బీసీలను వదిలేసి అగ్రవర్ణాల వాళ్లను అధ్యక్షులుగా నియమించిందని చెప్పుకొచ్చారు. రాజాసింగ్ రాజీనామా ఆమోదంతో బీజేపీ బీసీలకు వ్యతిరేకమని స్పష్టం అవుతుందన్నారు.


ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలలో ఉన్న బీసీ నాయకులెవరైనా బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడొద్దని ఆయన సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎవరి పోరాటం కాదని.. కామారెడ్డి డిక్లరేషన్‌ని అమలు చేశామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవద్దని.. స్థానిక సంస్థల ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు మద్దతివ్వాలని కోరారు. ఇప్పటికే 18 నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశామని.. ఇప్పటికైనా అన్ని పార్టీలు ఇందుకు సహకరించాలని కోరారు. ఉక్కు కవచంగా నిలబడి బీసీ రిజర్వేషన్లను కాపాడుకుంటామని మంత్రి పొన్నం ఈ సందర్భంగా స్పష్టం చేశారు.


గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం రాజాసింగ్ బీజేపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఆ లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అందించారు. బీజేపీ ముఖ్య నేతల తీరుతో తాను తీవ్రంగా కలత చెందినట్లు ఈసందర్భంగా రాజాసింగ్ చెప్పుకొచ్చారు. తాను బీజేపీ ఎమ్మెల్యేగా కమలం గుర్తుపై గెలిచానని.. అందుకే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు. అయితే ఈ లేఖను కిషన్ రెడ్డి గారే స్వయంగా స్పీకర్‌కు అందించాలని రాజాసింగ్ కోరారు.


బీజేపీ తెలంగాణ పార్టీ అధ్యక్షుడి ఎంపిక ముందుగానే పూర్తయిందని.. అలానే తెలంగాణలో బీజేపీ పార్టీ ఓడిపోవాలని కోరుకునేవారు.. తమ పార్టీలోనే ఎక్కువ మంది ఉన్నారంటూ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవన్ని చూసి తాను కలత చెందానని అందుకే రాజీనామా చేస్తున్నాని ప్రకటించారు. దీంతో బీజేపీ హైకమాండ్ 2025, జూలై 11న రాజాసింగ్ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa