ట్రెండింగ్
Epaper    English    தமிழ்

5 రూపాయలకే,,, 6 వెరైటీలు,,,,ఇందిరమ్మ క్యాంటీన్లలో టిఫిన్స్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 11, 2025, 09:35 PM

తెలంగాణలోని రేవంత్ సర్కార్.. ఇందిరమ్మ క్యాంటీన్లను తెచ్చేందుకు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరం అంతటా ఇందిరమ్మ క్యాంటీన్లు తెరిచి.. వాటి ద్వారా పేద వారికి అతి తక్కువ ధరకే అనగా కేవలం 5 రూపాయలకు రుచికరమైన, నాణ్యమైన అల్పాహారం అందించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది. త్వరలోనే నగర వ్యాప్తంగా ఇందిరమ్మ క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం నగరవ్యాప్తంగా మధ్యాహ్నం వేళ రూ.5కే భోజనం పెడుతూ.. పేద వారి కడుపు నింపుతున్న అన్నపూర్ణ క్యాంటీన్లనే.. ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చనున్నారు. ఇకపై వీటిల్లో మధ్యాహ్న భోజనంతో పాటుగా ఉదయం పూట టిఫిన్ కూడా అత్యంత తక్కువ ధరకే అందించేందుకు రేవంత్ సర్కార్ ముందుకు వచ్చింది.


దీనిలో భాగంగా ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా అందించబోయే టిఫిన్లకు సంబంధించి.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) మెనూ సిద్ధం చేసింది. వీటిల్లో ఇడ్లీ, పూరీ, ఉప్మా, పొంగల్‌తో పాటుగా మిల్లెట్ టిఫిన్లు కూడా అందించనున్నారు. జీహెచ్ఎంసీ నిర్ణయం మేరకు.. ప్రజల నుంచి ఒక్కో టిఫిన్‌కు కేవలం రూ.5 మాత్రమే వసూలు చేయనుంది. జీహెచ్ఎంసీలో వడ్డించే టిఫిన్‌కు సాధారణంగా రూ.19 ఖర్చవుతుండగా.. జనాల నుంచి రూ.5.. మిగతా రూ.14 ఖర్చును ప్రభుత్వమే భరించేందుకు సిద్ధమవుతుంది.


హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ రూపొందించిన టిఫిన్ మెనూను అమలు చేయనున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మిల్లెట్ ఆహారానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రోజుకో రకమైన అల్పాహారాన్ని.. అత్యంత తక్కువ ధరకే సామాన్యులకు అందించనున్నారు. ఈ మెనూలో భాగంగా 6 రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో రకం టిఫిన్ వడ్డించనున్నారు. మెనూలో ఉన్న టిఫిన్ లిస్ట్ రోజు వారిగా ఇలా ఉండబోతుంది.


1వ రోజు: మిల్లెట్ ఇడ్లీ (3), సాంబార్, చట్నీ/పొడి


2వ రోజు: మిల్లెట్ ఉప్మా, సాంబార్, మిక్స్ చట్నీ


3వ రోజు: పొంగల్, సాంబార్, చట్నీ


4వ రోజు: ఇడ్లీ (3), సాంబార్, చట్నీ


5వ రోజు: పొంగల్, సాంబార్, చట్నీ


6వ రోజు: పూరీ (3), ఆలూ కూర్మా


ఇందిరమ్మ క్యాంటీన్లలో వడ్డించే ప్రతి టిఫిన్‌కు సరిపోయేలా ఖచ్చితమైన గ్రాముల వారీగా పదార్థ పరిమాణాలూ నిర్ణయించారు. ఉదాహరణకి మిల్లెట్ ఇడ్లీ తీసుకుంటే.. ఒక్కో ఇడ్లీ 45 గ్రాములు, సాంబార్ 150 గ్రాములు, చట్నీ 15 గ్రాములుగా ఉండనుంది. ఇందిరమ్మ క్యాంటీన్ల కోసం జీహెచ్‌ఎంసీ 139 ప్రాంతాల్లో కొత్త కంటైనర్లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం మొత్తం రూ.11.43 కోట్ల ఖర్చు చేయనున్నారు. ఈ క్యాంటీన్‌లలో నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తూ, పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యం. పేద, మధ్య తరగతి ప్రజల కోసం రూపొందించిన ఈ పథకం.. వారికి తక్కువ ధరకే ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని అందించడంలో మైలురాయిగా నిలవనుంది అంటున్నారు అధికారులు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa