తన కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేయడంతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత , ఆమె కుటుంబం తనను చంపడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఇలాంటి దాడులతో బీసీ ఉద్యమం ఆగిపోతుందని అనుకుంటే పొరపాటేనని మల్లన్న అన్నారు. ఉదయం 11.30 గంటల సమయంలో 30 మంది తన కార్యాలయంపై దాడి చేశారని మల్లన్న చెప్పారు. తన గన్మెన్లు ఆపడానికి ప్రయత్నించినా తోసుకుంటూ లోపలికి వచ్చారని తెలిపారు. కవిత అనుచరుల దాడిలో తన చేతికి గాయమైందని చెప్పారు. తన గన్మెన్ నుంచి తుపాకీ లాక్కొని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారని మల్లన్న ఆరోపణలు చేశారు.
ఈ తరహా దాడులు చేసినంత మాత్రాన బీసీలు, అణగారిన వర్గాల కోసం చేసే ప్రయత్నాలు ఆగవని మల్లన్న స్పష్టం చేశారు. మరింత ఉత్సాహంతో ముందుకెళ్తామని ఆయన అన్నారు. ఇలాంటి వాటికి తాను భయపడనని ఆయన తేల్చి చెప్పారు. ‘రాసి పెట్టుకోండి.. రానున్న మూడేళ్లలో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది" అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. బీసీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో తాము పోరాడుతున్నామని మల్లన్న తెలిపారు. ప్రభుత్వం తమ సలహాలను స్వీకరిస్తోందని, పొరపాట్లు జరిగితే సరిచేసుకుంటోందని ఆయన అన్నారు. ఈ విషయంలో కవితకు ఎందుకు బాధ కలుగుతుందో అర్థం కావడం లేదని మల్లన్న ప్రశ్నించారు.
రాజకీయ ఉనికి కోసం అయితే కేసీఆర్ను అడగాలని ఆయన సూచించారు. ఎమ్మెల్సీ కవితకు తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్పై ఉన్న కోపం.. తమపై చూపిస్తే కుదరదని మల్లన్న అన్నారు. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని మీ కుటుంబం దోచుకుందని మల్లన్న ఆరోపించారు. ఇలాంటి దాడులతో మరింత దిగజారి ప్రజల్లో చులకన కావడం తప్ప ఇంకేమీ ఉండదని ఆయన అన్నారు. సహచర ఎమ్మెల్సీపై దాడులకు ప్రేరేపించిన కవిత ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మల్లన్న డిమాండ్ చేశారు. ‘మా కార్యాలయంలో పడిన రక్తపు మరకల సాక్షిగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం’ అని ఆయన అన్నారు. కాగా, జాగృతి కార్యకర్తలను అదుపుచేయడానికి మల్లన్న గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ సమయంలో ఓ బుల్లెట్ జాగృతి కార్యకర్త భుజం మీదుగా దూసుకెళ్లడంతో అతడికి గాయమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa