ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతీ మహిళ ఖాతాల్లోకి రూ.2500..! పాస్టాఫీస్ వద్ద క్యూ కట్టిన మహిళలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 15, 2025, 09:19 PM

నేటి సమాజంలో నిజం కంటే అబద్ధాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వాడకం ఎక్కువ అవ్వడం వల్ల.. ఆధారాలు లేని వార్తలు, పుకార్లు క్షణాల్లో ప్రజల్లోకి వెళ్లిపోతున్నాయి. దీనివల్ల లాభాల కంటే కూడా అనర్థాలే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ప్రజలు వాస్తవాలను నిర్ధారించుకోకుండానే నమ్మేసి, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్నిసార్లు ఈ ప్రచారాలు వ్యక్తుల జీవితాలపై, సామాజిక సామరస్యంపై, చివరకు ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. విశ్వసనీయత కోల్పోవడం, అనవసర భయాందోళనలు, ఆర్థిక నష్టాలు వంటివి అబద్ధ ప్రచారం వల్ల జరిగే కొన్ని ప్రధాన అనర్థాలుగా చెప్పుకోవచ్చు.


ఇందుకు తాజా ఉదాహరణగా.. తెలంగాణలోని మహాలక్ష్మి పథకంకు సంబంధించి జరిగిన ఒక ప్రచారం ప్రజలను అయోమయానికి గురిచేసింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.2500 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అయితే.. పోస్టాఫీస్‌లో ఖాతా ఉంటేనే రూ.2500 జమ చేస్తారని ఒక అవాస్తవ ప్రచారం విస్తృతంగా సాగింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. ఈ పుకారు నిజమని నమ్మి, హనుమకొండ జిల్లాలోని మహిళలు గత వారం రోజుల నుంచి పోస్టాఫీసుల వద్ద భారీగా క్యూ కట్టారు.


కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన ఆరు గ్యారెంటీలలో 'మహాలక్ష్మి పథకం' ఒకటి. దీని కింద ప్రతినెలా అర్హులైన మహిళలకు రూ.2500 ఆర్థిక సహాయం అందించాలని ప్రతిపాదించింది. ఇంకా ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు.. రూ.2500 చెల్లింపు ప్రక్రియ ఇంకా ప్రారంభం కానప్పటికీ.. దానిపై వచ్చిన తప్పుడు ప్రచారం మహిళలను పోస్టాఫీసుల వైపు పరుగులు తీయించింది.


హనుమకొండలో బాలింతలు, వృద్ధులు సైతం గంటల తరబడి ఎండలో వేచి ఉండి ఖాతాలు తీసుకున్నారు. దీనిపై తపాలా కార్యాలయ అధికారిని వివరణ కోరగా.. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని స్పష్టం చేశారు. పోస్టాఫీసు ఖాతా సాధారణంగా అందరికీ ప్రయోజనకరమైనదే కాబట్టి.. వచ్చిన వారికి ఖాతాలు తెరుస్తున్నామని తెలిపారు.


ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మీ పథకం ఎంతో ప్రతిష్టాత్మకం అయినది. దీనిలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ పథకం 2023 డిసెంబర్ 9న ప్రారంభమై, లక్షలాది మంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తోంది. దీంతో పాటు.. అర్హులైన రేషన్ కార్డుదారులు, గృహ జ్యోతి పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించే పథకం ఇది. వీటితో పాటు.. ప్రతినెలా రూ.2500 ఆర్థిక సహాయం అందించే పథకం కూడా ఉంది. అయితే ఇది ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టమైన మార్గదర్శకాలు, విధివిధానాలను ప్రకటించాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa