ఆడబిడ్డలకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రేవంత్ రెడ్డి లక్ష్యమని ఆమె అన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల బ్యాంక్ లింకేజీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆమె శుక్రవారం పర్యటించి మంత్రి పొంగులేటితో కలిసి మహిళలకు చెక్కలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు అందర్నీ కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. అందులో భాగంగానే మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇల్లందు నియోజకవర్గంలో పర్యటించిన ఆమెకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. లంబాడీలు తమ సంప్రదాయ దుస్తుల్లో ఆమెకు ఆహ్వానం పలికారు. సభా స్థలికి చేరుకున్న సీతక్క, పొంగులేటిపై పూల వర్షం కురిపించారు.
ఒక మహిళ సంఘంలో ఉంటే వడ్డీ లేకుండానే బ్యాంకుల ద్వారా తమ ప్రభుత్వం రుణాలు అందిస్తున్నట్లు సీతక్క తెలిపారు. ఒకవేళ సంఘంలో ఉన్న మహిళ చనిపోతే ఆమె పేరు మీద ఉన్న అప్పుల్లో రూ. 2 లక్షల వరకు మాఫీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మహిళా సంఘాల ద్వారా వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. 60 సంవత్సరాలు దాటినప్పటికీ ఆ మహిళను సంఘంలో చేర్పిస్తున్నామన్నారు.
ముఖ్యంగా మహిళలు తయారు చేసిన వస్తువులను అమ్ముకోవడం కోసం రూ. 300 కోట్లు వెచ్చించి హైదరాబాద్లో దుకాణాలు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. గోదాంలు, మిల్లలు, పెట్రోల్ బంక్లు, కోళ్లఫారాలు ఇలా ఎన్నో కుటీర పరిశ్రమలు మహిళా సంఘాలకు ఇస్తున్నామని తెలిపారు. ఆడవాళ్లలో ఉక్కు మహిళ ఇందిరమ్మ అని గుర్తు చేశారు. కుటుంబం పేదరికంలో ఉండకూడదు అంటే మహిళల చేతిలో డబ్బులు ఉండాలని చెప్పారు. అనంతరం మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa