తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ వేడిగా ఉంటాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో.. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మధ్య జరుగుతున్న రాజకీయ వాదోపవాదాలు ఒక నాటకాన్ని తలపిస్తున్నాయి. తాజాగా.. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఈ పోరును మరింత తీవ్రతరం చేశాయి.
కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ వ్యాఖ్యలు..
‘రేవంత్రెడ్డికి ఎప్పటికీ కేసీఆర్ స్థాయి రాదు’ అంటూ కేటీఆర్ తన విమర్శలకు పదును పెట్టారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన స్పష్టం చేశారు. తమ BRS ప్రభుత్వం హయాంలో తెలంగాణను అనేక రంగాల్లో నెం.1గా నిలిపామని గుర్తు చేశారు. తాము తప్పు చేయలేదు కాబట్టే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నామని కేటీఆర్ పునరుద్ఘాటించారు.
"ఆధారాలు లేకుండా డ్రగ్స్, హీరోయిన్స్ అంటూ అనవసర ఆరోపణలు చేస్తున్నారు" అని కేటీఆర్ రేవంత్రెడ్డిపై మండిపడ్డారు. 'దుబాయ్లో ఎవరో చనిపోతే నాకేం సంబంధం?' అని ప్రశ్నిస్తూ, దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు. "ఇంకెంతకాలం ఆరోపణలు చేస్తారు? కాంగ్రెస్ ఇచ్చిన హామీల సంగతేంటి?" అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఏపీ మంత్రి నారా లోకేష్తో కేటీఆర్ అర్ధరాత్రి రహస్యంగా కలిశారన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. "నేను లోకేష్ను కలవలేదు.. కలిసినా తప్పేంటి? లోకేష్ను అర్ధరాత్రి కలవాల్సిన అవసరం నాకేంటి?" అని ప్రశ్నించారు. ఈ ఆరోపణలు చంద్రబాబుతో రేవంత్రెడ్డి రహస్య ఒప్పందం బయటపడటంతో చేస్తున్న 'డైవర్షన్ పాలిటిక్స్' అని కేటీఆర్ విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలోనూ రేవంత్రెడ్డి అడ్డంగా దొరికిపోయారని కేటీఆర్ ఆరోపించారు. "బనకచర్లపై చర్చించామని ఏపీ మంత్రి నిమ్మల అన్నారు.. కానీ చర్చించలేదని రేవంత్ చెప్పారు. ఇందులో నిజం ఏది?" అంటూ నిలదీశారు.
"అసెంబ్లీలో చర్చిద్దామంటున్నారు.. మా మైక్ కట్ చేయకుండా ఉంటే చర్చకు సిద్ధం" అని కేటీఆర్ సవాల్ చేశారు. రేవంత్రెడ్డిని "మానసిక హాస్పిటల్లో చూపించాలి" అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలదీస్తూనే ఉంటామని, ప్రజల పక్షాన పోరాడుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
'రేవంత్లా నేను దొంగను కాదు, సంచులు మోయలేదు' అంటూ కేటీఆర్ వ్యంగ్య బాణాలు విసిరారు. గోదావరి జలాలను చంద్రబాబుకు అప్పగించి తెలంగాణకు ద్రోహం చేశారని ఆరోపించారు. అంతేకాకుండా.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫోన్లను రేవంత్రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తన ముఖ్యమంత్రి సీటుకు ఎసరు పెడుతున్నారనే భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. త్వరలోనే ఆధారాలతో సహా అన్ని నిజాలను బయటపెడతానని కేటీఆర్ ప్రకటించారు. రేవంత్రెడ్డి తప్పు చేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa