ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసీఆర్ రాసి పెట్టుకో.. 2034 వరకు నేనే సీఎం: రేవంత్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 18, 2025, 07:30 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కొల్లాపూర్‌ మండలం జటప్రోల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం.. బహిరంగ సభలో మాట్లాడారు. తమ ప్రభుత్వం అత్యంత వెనుకబడిన కొల్లాపూర్‌ ప్రాంతానికి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అయితే.. ఆయన ప్రసంగం ఎక్కువగా భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌పై తీవ్రస్థాయి విమర్శలతో కొనసాగింది.


‘పాలమూరు బిడ్డలు కేసీఆర్‌ను అక్కున చేర్చుకుని పార్లమెంట్‌కు పంపితే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ గడ్డకు ఆయన చేసిందేమీ లేదు’ అని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్‌ సీఎం అయ్యాక తెలంగాణలోని ప్రాజెక్టులకు ఎక్కువ అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. శ్రీశైలం ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు, జీవో 98 ద్వారా ఇవ్వాల్సిన పరిహారం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్పిస్తామని చెప్పి కేసీఆర్ మాట తప్పారని, అలంపూర్, అచ్చంపేట, కొల్లాపూర్‌ ప్రాంతాల్లో ఉన్న ఈ వర్గాలకు ఎందుకు న్యాయం చేయలేదని ప్రశ్నించారు.


 ‘కరీంనగర్‌ నుంచి పారిపోయి పాలమూరు వస్తే అండగా నిలబడ్డాం. పదేళ్ల పాలనలో ఈ ప్రాంతానికి సున్నం పెట్టింది మీరు కాదా?’ అని కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మాదిగల పిల్లలకు వైద్య విద్య సీట్లు వస్తుంటే కేసీఆర్‌కు దుఃఖం వస్తుందా అని ప్రశ్నించారు. ‘పాలమూరు పచ్చగా మారుతుంటే ఎందుకంత విషం చిమ్ముతున్నావు..? ఈ జిల్లా అంటే ఎందుకింత చిన్నచూపు?’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్‌కు మద్దతిస్తున్న జిల్లా నేతలు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డికి సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.


‘బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తిచేయలేదు..? కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌, జూరాల ప్రాజెక్టుల పరిస్థితి ఏమైంది..? ఒక్క కాళేశ్వరం కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారు. 2019లో కడితే.. 2023లో అది కూలింది. చిన్న గుడిసె వేసుకునేవాడు అయినా పదేళ్లు ఉండేట్టు నిర్మించుకుంటాడు’ అంటూ కేసీఆర్‌ పాలనా వైఫల్యాలను రేవంత్‌రెడ్డి ఎత్తి చూపారు.


‘2034 వరకు పదేళ్లపాటు పాలమూరు బిడ్డ (తాను) సీఎంగా ఉంటాడు. కేసీఆర్‌.. ఈ విషయాన్ని డైరీలోనో.. నీ గుండెలపైనో రాసుకో’ అని సవాల్ విసిరారు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతానని, పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ‘ఉమ్మడి జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణకు ఎన్ని వందల కోట్లు ఖర్చు అయినా.. ఈ ఏడాది డిసెంబర్ 9లోపు నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చి భూమి సేకరిస్తాం. రానున్న రెండేళ్లలో ఆ ప్రాజెక్టులు పూర్తిచేయాలని నిర్ణయించాం’ అని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.


ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి..


తెలంగాణలోని ప్రాజెక్టులను అడ్డుకోవద్దని ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘చంద్రబాబూ.. మీరు విజ్ఞులు. మీరే కల్వకుర్తి మొదలుపెట్టారు. మీరు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాలమూరు-రంగారెడ్డి మొదలైంది. మీ కాలంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను అడ్డుకోవడం ఏం న్యాయం..?’ అని ప్రశ్నించారు. ‘పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులను అడ్డుకోవద్దు. నాడు పాలమూరును మీరు దత్తత తీసుకున్నారు. చంద్రబాబూ.. మీరు బాధ్యతగా ఉండండి.. మమ్మల్ని బతకనీయండి. రాయలసీమ ఎత్తిపోతలను రద్దు చేయాలని కోరుతున్నా’ అని సీఎం అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa