ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ సెక్రటేరియట్‌లోకి ఎంట్రీ.. విజిటింగ్ పాస్‌పై కీలక నిర్ణయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 20, 2025, 04:45 PM

తెలంగాణ సచివాలయంలోకి ప్రవేశించే సందర్శకులను కంట్రోల్ చేయటం, భద్రత పెంపు లక్ష్యంగా రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ఈ-పాస్ విధానం త్వరలో అమలులోకి రానుంది. ఈ నూతన వ్యవస్థ ద్వారా విజిటర్లకు క్యూఆర్ కోడ్ ఆధారిత ఈ-పాస్‌లు జారీ చేయనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సాధారణ విజిటింగ్ అవర్స్ యథావిధిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ-పాస్ సాఫ్ట్‌వేర్‌ను ఐటీ శాఖ పర్యవేక్షణలో అభివృద్ధి చేశారు. దీని రూపకల్పనలో సాధారణ పరిపాలన శాఖ (GAD), సచివాలయ భద్రతను పర్యవేక్షించే పోలీస్ వింగ్ అయిన SPF అధికారులు కీలక సలహాలు, సూచనలు అందించారు.


సందర్శకులను లోనికి అనుమతించడానికి, ప్రతి మంత్రి, కార్యదర్శి పేషీకి ఈ పోర్టల్‌కు సంబంధించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను కేటాయిస్తారు. వారి పేషీకి వచ్చే సందర్శకుడి పేరు, చిరునామా, ఆధార్ కార్డు నంబర్, ఫోన్ నంబర్ వంటి వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేయగానే ఆ సందర్శకుడి స్మార్ట్‌ఫోన్‌కు ఒక క్యూఆర్ కోడ్ పంపబడుతుంది. సచివాలయం ఎంట్రీ గేట్ వద్ద సందర్శకులు ఈ క్యూఆర్ కోడ్‌ను చూపించాల్సి ఉంటుంది. అక్కడ విధిలో ఉన్న భద్రతా సిబ్బందికి ఈ కోడ్‌ను స్కాన్ చేసేందుకు ప్రత్యేకమైన యాప్‌ను రూపొందించారు. యాప్‌లో కోడ్‌ను స్కాన్ చేయగానే సందర్శకుడి వివరాలు డిస్‌ప్లే అవుతాయి. వాటిని సరిచూసుకున్న తర్వాతే సందర్శకులను లోనికి అనుమతిస్తారు.


ప్రస్తుతం సచివాలయంలో సందర్శకుల వేళలు సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఉన్నప్పటికీ, ఉదయం 10 గంటల నుంచే చాలా మంది మంత్రులు, కార్యదర్శుల పేషీల నుంచి ఫోన్ చేసి తమకు సంబంధించిన వ్యక్తులను లోనికి పిలుచుకుంటున్నారు. దీంతో రోజుకు ఎంత మంది సందర్శకులు లోనికి వెళ్తున్నారో, వారి వివరాలు ఏమిటో లెక్కలు ఉండటం లేదు. ఈ కొత్త ఈ-పాస్ విధానం అమల్లోకి రావడంతో, ఏ పేషీ నుంచి విజిటర్‌కు క్యూఆర్ కోడ్ వెళ్లింది, ఒక పేషీ నుంచి రోజుకు ఎంత మందికి పాస్‌లు జారీ అయ్యాయి, సచివాలయంలోకి ప్రతి రోజు ఎంత మంది వస్తున్నారు అనే పూర్తి వివరాలు GAD అధికారుల వద్ద నమోదు అవుతాయి. ఇది భద్రతను పెంపొందించడమే కాకుండా, సందర్శకుల రాకపోకలపై పూర్తి జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది.


సచివాలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ దేవీదాస్ మాట్లాడుతూ.. ఈ-పాస్ అమలు వల్ల సచివాలయంలోకి వచ్చే సందర్శకుల సంఖ్యపై పూర్తి స్పష్టత ఉంటుందని, ఎవరి అనుమతితో సందర్శకులు వచ్చారో అనే సమాచారం తమ వద్ద ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఈ-పాస్ సిస్టమ్ ట్రయల్ రన్ కొనసాగుతోంది. ఐటీ, ఆరోగ్య శాఖ మంత్రుల పేషీలలో, అలాగే విద్యా, ఆరోగ్య శాఖ కార్యదర్శుల పేషీలలో ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. విజయవంతంగా అమలైన తర్వాత దీనిని అన్ని శాఖలకు విస్తరించే అవకాశం ఉందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa