ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాసిరకం భోజనంతో ,,,అధ్వానంగా గిరిజన, గురుకుల పాఠశాలలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 21, 2025, 05:19 PM

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు.. ముఖ్యంగా గిరిజన, గురుకుల పాఠశాలల పరిస్థితి దారుణంగా తయారయింది. ఆహారం బాగోలేదంటూ వారంలో రెండు రోజులు ఏదో ఒక పాఠశాలలో నిరసనలు జరుగుతూనే ఉంటున్నాయి. పురుగుల పట్టిన అన్నం తిని ఫుడ్ పాయిజన్‌కు గురై ఆస్పత్రులలో కూడా జాయిన్ అవుతున్నారు. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నామమాత్రపు చర్యలు తీసుకుంటుందని, శాశ్వత పరిష్కారం వైపు ఆలోచించడం లేదంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.


మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంటలో ఉన్న ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజుల కిందట ఎనిమిదో తరగతి విద్యార్థిని తరుణి, ఆరో తరగతి బాలికలు అలకనంద, రేవతి అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురు విద్యార్థినులను ఆస్పత్రికి తరలించగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నాలుగు రోజులు విద్యార్థినుల పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ కనీసం సమాచారం ఇవ్వకపోవడంతో పాఠశాల సిబ్బందిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


అదేవిధంగా భద్రాచలం ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాలలో అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థినులు నిరసన తెలిపారు. మూడు రోజులుగా పురుగుల అన్నం పెడుతున్నారని ప్రిన్సిపాల్, హాస్టల్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం టిఫిన్ కోసం చేసిన 80 కిలోల కిచిడీలో పురుగులు రావడంతో అది తినకుండానే 600 మంది విద్యార్థినులు తరగతి గదులకు వెళ్లి నిరసన తెలిపారు.


నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి భోజనం తర్వాత కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలకు గురై 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం విద్యార్థులను ఇంటికి పంపించడంతో తల్లిదండ్రులు ఆరాతీశారు. కొన్ని రోజులుగా ఉడకని అన్నం పెడుతున్నారని, నీళ్ల చారు పోస్తున్నారని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. ఇదేంటని నిలదీసిన విద్యార్థులను.. మీ ఇంటి వద్ద ఇంతకంటే మంచి భోజనం ఉంటుందా అంటూ సిబ్బంది బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


సంగారెడ్డి జిల్లా మోర్గి ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో కూడా ఫుడ్ పాయిజన్‌తో 11 మంది విద్యార్థులు ఆస్పత్రుల పాలయ్యారు. ఈ విద్యార్థులందర్నీ నారాయణఖేడ్ ఆస్పత్రికి తరలించారు. వరుస ఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవలే కరీంనగర్ జిల్లాలోని కేశపట్నం కస్తూర్బా గాంధీ బాలికల విద్యార్థినులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎదుటే కన్నీటి పర్యంతమయ్యారు. నాసిరకం భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa