ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో మల్లారెడ్డి కోడలు భేటీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 21, 2025, 08:25 PM

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉండే బీఆర్ఎస్, బీజేపీ నాయకులు భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇంతకు ఈ ఆసక్తికర భేటీ ఎవరి మధ్య జరిగిందంటే.. బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి భేటీ అయ్యారు. ప్రస్తుతం వీరి భేటీకి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి ఇంతకు వీరిద్దరూ ఎందుకు భేటీ అయ్యారు.. దీని వెనక ఏవైనా రాజకీయ కారాణాలున్నాయా.. లేదా వేరే ఇతర కారణాాలా అని జనాలు చర్చించుకుంటున్నారు.


నేడు అనగా సోమవారం నాడు.. మేకలమండి బీజేపీ నాయకుడి ఇంట్లో నిర్వహించిన లంచ్ కార్యక్రమానికి బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. ఇక ఇదే కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కూడా వచ్చారు. వీరిద్దరూ ఒకే టేబుల్ మీద భోజనానికి కూర్చున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ తమతో పాటు కూర్చున్న వ్యక్తులను ప్రీతి రెడ్డికి పరిచయం చేయగా.. ఆమె మర్యాదపూర్వకంగా వారికి నమస్కారం చేశారు. ఆతర్వాత ప్రీతిరెడ్డి, బండి సంజయ్‌లు సరదాగా మాట్లాడుకున్నారు.


బండి సంజయ్, ప్రీతిరెడ్డిలు భేటీ అయిన వీడియో , ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఈ భేటీ హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రీతిరెడ్డి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగతున్నారు. ఇదిలా ఉంటే.. నిన్న పాతబస్తీలో జరిగిన బోనాల వేడుకల్లో బండి సంజయ్, ప్రీతిరెడ్డి ఫొటోలు కలిపి ఉన్న ఫ్లెక్సీలు వెలిశాయి. ఆతర్వాత మరుసటి రోజే అనగా సోమవారం నాడే వీరు ఇరువురు ఇలా భేటీ కావడం సంచలనంగా మారింది. అయితే వీరి సన్నిహితులు మాత్రం దీనిలో రాజకీయ అంశాలు ఏం లేవని.. సాధారణంగానే కలిశారని.. ఇద్దరూ ఒకే కార్యక్రమానికి హాజరు కావడంతో.. పలకరించుకున్నారని అంటున్నారు.


ఇదిలా ఉంటే ప్రీతిరెడ్డి మెట్టినిల్లు అయిన మల్లారెడ్డి కుటుంబం అంతా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆమె మాత్రం పాలిటిక్స్ మీద పెద్దగా ఆసక్తి చూపరు. ఆమె డాక్టర్. ఇక ప్రీతి రెడ్డి విషయానికి వస్తే.. ఆమె స్వస్థలం కర్నాటకలోని హుబ్లి. అమ్మ సైంటిస్ట్, నాన్న డాక్టర్‌. ఇద్దరికీ పూనాలో ఉద్యోగం చేసేవారు. తల్లి వల్ల ప్రీతి రెడ్డి భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. అలానే తల్లిదండ్రుల కోరిక మేరకు డాక్టర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె మల్లారెడ్డి గ్రూప్ విద్యాసంస్థల డైరెక్టర్‌గా ఉన్నారు.


మల్లారెడ్డి ఆస్పత్రుల్లో ఉచితంగా డెలివరీ చేసి, కిట్‌ అందిస్తున్నారు. ఆడపిల్లను కన్న తల్లికి ప్రోత్సాహకం ఇస్తున్నారు. అలానే డెంటల్‌ హాస్పిటల్‌లో రోజుకు 250 మందికి ఉచిత వైద్యంతోపాటు 750 బెడ్‌లున్న టీచింగ్‌ ఆస్పత్రుల్లో కూడా ఫ్రీగా వైద్యం చేస్తారు. ఈ నిర్ణయాల వెనక ప్రీతి రెడ్డి ఉన్నారు. ఇక అత్తింటి వారు తనను సొంత కుమార్తెలా చూసుకుంటారని.. వారి ప్రోత్సాహం వల్లే తాను కెరీర్‌లో ముందుకు సాగుతున్నాని ప్రీతి రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa