ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైరల్ ఫీవర్లతో ఆస్పత్రి పాలవుతున్న జనం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 22, 2025, 07:55 PM

వానొచ్చేనంటే వరదొస్తది.. వయసొచ్చేనంటే వలపొస్తది' అనే సినిమా పాట ఎంత పాపులరో.. 'వానొచ్చేనంటే వ్యాధులొస్తాయి.. వైరల్ ఫీవర్లు వస్తాయి' అనేది అంత రియాలిటీ. వానాకాలం వచ్చిందంటే చాలు.. రకరకాల ఇన్ఫెక్షన్లు, జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలు పీడిస్తుంటాయి. దోమలు విజృంభించడమే అందుక్కారణం. అందుకే, వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు విపరీతంగా వ్యాపిస్తూ ఉంటాయి.


నీరు నిలవడంతో అందులో దోమలు తిష్టవేస్తాయి. అవి భయానక వ్యాధులు ప్రబలేందుకు కారణం అవుతాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో.. హైదరాబాద్ నగరానికి మళ్లీ జ్వరమొచ్చింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వైరల్ జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపలు అధికారులు అప్రమత్తమయ్యారు. అయినప్పటికీ ఆ చర్యలు సరిపోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందే దేశంలోకి ప్రవేశించాయి. అయితే, తెలంగాణలో మాత్రం జూన్ నెలలో ఆశించినంత వర్షం కురవలేదు. కానీ, జూలై రెండో వారం నుంచి.. రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా భారీ వానలు పడుతున్నాయి. భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం.. స్తంభించిపోతోంది. క్యుములోనింబస్ మేఘాల కారణంగా కొన్ని గంటల్లోనే కుండపోత వర్షం కురవడంతో.. రోడ్లను వరద నీరు ముంచెత్తుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూలిగేనక్క మీద తాటిపండు పడ్డట్లు ఇదే సమయంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి.


పెరుగుతున్న సీజనల్ వ్యాధులివే..


వర్షాలు పడుతుండటంతో నగరంలోని ఆస్పత్రలు వైరల్ ఫీవర్ల బాధితులతో కిక్కిరిపోయాయి. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్‌ ఆస్పత్రుల్లో పెద్ద సంఖ్యలో బాధితులు వచ్చి చేరుతున్నారు. ప్రభుత్వాస్పత్రులు మాత్రమే కాకుండా.. ప్రైవేట్ హాస్పిటల్‌లోనూ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, చికున్ గున్యా లాంటి విష జ్వరాలతో జనం అల్లాడుతున్నారు.


గత సంవత్సరంతో పోల్చితే ఈసారి తక్కువ కేసులే నమోదయ్యాయని ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నప్పటికీ.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయి. వర్షాలతో ఒక్కసారిగా వాతావరణం మారడంతో వైరల్‌ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని వైద్యులు తెలిపారు. సెప్టెంబరు నెలాఖరు వరకు ఈ సీజనల్ వ్యాధులు కొనసాగే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు.


ఈ ఏడాది ప్రారంభం నుంచి జూలై 15 వరకు ఒక్క హైదరాబాద్ నగరంలోనే 63,194 మంది వైరల్‌ జ్వరాల బారినపడ్డారు. వీరిలో 5798 మంది డయేరియా, 11,055 మంది శ్వాసకోశ వ్యాధులు, 355 మంది డెంగ్యూ, ఆరుగురు మలేరియా, 65 మంది చికున్‌ గున్యా, 684 మంది టైఫాయిడ్‌ వ్యాధుల బారినపడ్డారు.


జనవరి నుంచి హైదరాబాద్‌లో కేసులు


మొత్తం వైరల్ జ్వరాలు - 63,194


డయేరియా కేసులు - 5798


శ్వాసకోశ సంబంధిత కేసులు - 11,055


డెంగ్యూ జ్వరాలు - 355


మలేరియా కేసులు - 6


చికున్‌గున్యా కేసులు - 65


టైఫాయిడ్‌ కేసులు - 684


వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు


సాధారణంగా వర్షాకాలంలో వానలో తడవడం వల్ల జలుబు మొదలవుతుంది. దాని వల్ల జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు ప్రారంభం అవుతాయి. సాధారణంగా అయితే అవన్నీ 2 నుంచి 3 రోజుల్లో తగ్గిపోతాయి. అయితే 3, 4 రోజులు దాటిన తర్వాత కూడా జ్వరం ఉంటే మాత్రం వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇక కడుపు నొప్పి, కండరాల నొప్పి, శరీరంపై దద్దుర్లు ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తే.. ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి.


వానలు పడుతుండటంతో ప్రస్తుత పరిస్థితుల్లో నీరు, ఆహారం ఎక్కువగా కలుషితం అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటివి తాగినపుడు గానీ, తిన్నపుడు గానీ.. వాంతులు, వీరేచనాలు అయి శరీరం డీహైడ్రేడ్‌ అయి స్పృహ తప్పి పడిపోయే అవకాశాలు ఉంటాయి. నిర్లక్ష్యం చేస్తే కొన్నిసార్లు ప్రాణాల మీదికే వచ్చే ప్రమాదం ఉంటుంది. డయేరియా లక్షణాలు కన్పిస్తే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి సరైన చికిత్సను తీసుకోవాలి. మరీ ముఖ్యంగా పసిపిల్లలు, గర్భిణుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా.. వెంటనే డాక్టర్ల వద్దకు వెళ్లాలి.


లక్షణాలు కనిపిస్తే టెస్టులు తప్పనిసరి


వర్షాకాలంలో ఎక్కడపడితే అక్కడే నీటి గుంటల వద్ద దోమలు పెరిగిపోవడంతో మలేరియా, డెంగీ వంటి వ్యాధి లక్షణాలతో చాలా మంది ఆస్పత్రులకు వెళ్తున్నారు. మూడు రోజులకు మించి జ్వరం ఉన్నట్లైతే డెంగ్యూ, మలేరియా టెస్ట్‌లు తప్పసరిగా చేయించుకోవాల్సిందే. జ్వరంతో పాటు కడుపులో నొప్పి, వాంతులు, తీవ్రమైన తలనొప్పి ఉంటే టైఫాయిడ్‌ పరీక్షలు చేసుకోవాలి. చిన్న పిల్లల్లో జలుబు ఎక్కువగా ఉండటం, ముక్కు కారుతూ ఉండి, జ్వరం, దగ్గు, ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే.. దాన్ని న్యుమోనియా అని భావించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి.


వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలు


కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి.


ఎప్పటికప్పుడు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.


రోజుకు తప్పనిసరిగా 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం.


వర్షాకాలంలో తేలికపాటి వ్యాయామాలు చేసుకోవాలి.


ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.


దోమలు ఆవాసంగా మార్చుకునేందుకు ఏ అవకాశం ఇవ్వొద్దు.


ఇంట్లో వర్షపు నీరు నిల్వ ఉండేందుకు ఆస్కారం ఉన్న వస్తువులన్నింటినీ (ఉదా: ప్లాస్టిక్ డబ్బాలు, మొక్కల తొట్టెలు) తొలగించాలి లేదా శుభ్రం చేసుకోవాలి.


ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు


వర్షాకాలంలో ఇంట్లోనే తయారు చేసుకున్న వేడి వేడి ఆహారాన్ని తీసుకోవాలి.


వానా కాలంలో బయట ఫుడ్‌కు దూరంగా ఉండటమే ఉత్తమం. ముఖ్యంగా గప్‌చుప్‌ల లాంటి వాటి జోలికి వెళ్లకూడదు. వాటిలో వాడే నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంటుంది.


ఈ సీజన్‌లో దొరికే నారింజ, బత్తాయి, జామ, ఫైనాపిల్‌ లాంటి సీజనల్ ఫ్రూట్స్‌ను తీసుకోవాలి.


వ్యాధి నిరోధక శక్తిని పెంచే సీ విటమిన్లు ఉండే పండ్లను తీసుకోవాలి.


అధికారుల చర్యలు


వర్షాకాలంలో ఆరోగ్యశాఖతో పాటు మున్సిపల్ శాఖ అధికారులు కూడా ముందస్తుగానే చర్యలు తీసుకుంటారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి.. దోమలు చేరకుండా అక్కడ రసాయనాలు చల్లుతూ ఉంటారు. హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ అధికారులు.. నిత్యం దోమలను తరిమికొట్టేందుకు కాలనీల్లో దోమల మందును వెదజల్లుతూ ఉంటారు. అంతేకాకుండా వర్షాలు పడుతున్న సమయంలో చెట్లు విరిగినా.. ఎక్కడైనా మ్యాన్ హోల్స్ నిండిపోయినా.. తక్షణమే వాటిని తొలగించి.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతారు.


అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. చాలా ప్రాంతాల్లో మాత్రం పరిస్థితిలో మార్పు రావడం లేదు. లోతట్టు ప్రాంతాలు, మురికివాడల్లో వర్షాకాలం వచ్చిందంటే చాలు.. నీటి ముంపు, బురద, దోమలు అధికంగా ఉంటాయి. దీని వల్ల ఆ ప్రాంతాల్లో నివసించేవారికి సీజనల్ వ్యాధులు ప్రబలుతూనే ఉంటాయి. అధికారులు వచ్చి చేసే పనులు అటుంచితే.. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తప్పనిసరిగా దృష్టి సారించాలి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa