ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో 20 వేల ఇందిరమ్మ ఇళ్లు రద్దు,,,,లబోదిబోమంటున్న లబ్ధిదారులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 24, 2025, 06:33 PM

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పేదవారి సొంతింటి కల సాకారం కోసం ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. తొలి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ఇవన్ని ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఓ వార్త లబ్ధిదారులకు ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ఇప్పటి వరకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లలో.. సుమారుగా 20 వేల ఇండ్లను రద్దు చేశారని తెలుస్తోంది. మరి ఎందుకు ఇంత భారీ సంఖ్యలో ఇళ్లను రద్దు చేశారంటే..


ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రోజుకొక నిబంధనను అమలు చేస్తుందంటున్నారు లబ్ధిదారులు. ఇప్పటికే ఆగస్టు 1 నాటికి ఇంటి నిర్మాణం ప్రారంభించకపోతే.. అలాంటి లబ్ధిదారులు ఇళ్లను రద్దు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు అధికారులు కూడా క్షేత్రస్థాయిలో మార్గదర్శకాలను పట్టించుకోకుండా లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నియమాల ప్రకారం.. నిర్మాణ వైశాల్యం (బిల్టప్‌ ఏరియా) గరిష్ఠంగా 650 చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) ఉండాలని చెబుతుంది. అంతకన్నా తక్కువ వైశాల్యంలో ఇంటి నిర్మాణం చేపడితే.. అలాంటి వారికి నిధులు మంజూరు చేసేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.


నిర్మాణం ప్రారంభించాక రద్దు..


అయితే ఇళ్ల మంజూరు పత్రాలు ఇచ్చినప్పుడు వీటిని పట్టించుకోని అధికారులు.. ఇప్పుడు నిర్మాణాలు మొదలు పెట్టాక.. నియమాలు పాటించడం లేదని చెప్పి నిర్మాణం మొదలు పెట్టిన ఇళ్లను రద్దు చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 20 వేల ఇండ్లను రద్దు చేశారని తెలుస్తోంది. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చాలా మంది ఉన్న ఇంటిని కూల్చి.. కొత్తింటి నిర్మాణం మొదలుపెట్టారు. పనులు మధ్యలో ఉండగా.. ఇప్పుడు అధికారులు.. వారి ఇల్లు నిబంధనలకు అనుగుణంగా లేదని చెప్పి.. రద్దు చేస్తుండటంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.


రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మూడు లక్షల ఇండ్లను మంజూరు చేయగా.. సుమారు సగం మంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేపట్టారు. వీరిలో కొందరికి మొదటి విడత నిధులను కూడా విడుదల చేశారు. ఇలా ఇప్పటివరకు అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో సుమారు రూ.120 కోట్ల వరకు జమ చేశారు. ఇలా ఉండగానే.. నిర్మాణాలు చేపట్టిన వాటిలో దాదాపు 20 వేలకు పైగా ఇండ్లు నిబంధనలకు అనుగుణంగా లేవంటూ రద్దు చేశారు.


కేంద్ర ప్రభుత్వ తీసుకువచ్చిన పీఎంఏవై పథకంతో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌ను అనుసంధానం చేసుకొని ఇండ్లను మంజూరు చేయాల్సి ఉంది. కానీ అధికారులు హడావుడిగా ఇంటి మంజూరు పత్రాలు జారీ చేశారు. తీరా నిర్మాణం మొదలు పెట్టాక.. నిబంధనలు పాటించడం లేదని రద్దు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లోపం వల్ల ఈ సమస్య తలెత్తింది అంటున్నారు. అలానే కేంద్ర నిబంధనలు పట్టించుకోకుండా ఇళ్లను రద్దు చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


కేంద్ర నిబంధనలు ఎలా ఉన్నాయంటే..


ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) నిబంధనల ప్రకారం.. కార్పెట్‌ ఏరియా (గోడలు, బాల్కనీలు తప్ప లివింగ్‌ ఏరియా) కనీసం 30-45 చదరపు మీటర్ల వరకు ఉండాలని చెబుతుంది. దీని ప్రకారం చూసుకుంటే 322-484 చదరపు అడుగల వరకు ఇంటిని నిర్మించుకోవచ్చు. స్థలం తక్కువుంటే పైఅంతస్తులో ఒక గది నిర్మించుకునే అవకాశం ఉన్నది. కానీ అధికారులు వీటిని పట్టించుకోకపోవడం వల్ల లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa