ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు ప్రభుత్వ పథకాలతో.. రూ.2 లక్షల చిట్టి కడుతున్న మహిళ..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 24, 2025, 06:39 PM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఆరు గ్యారెంటీలపై ఎక్కువగా దృష్టి పెట్టిన రేవంత్ సర్కార్.. వాటిని అమలు చేస్తోంది. ఇలా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోందని మరోసారి స్పష్టమైంది. ప్రభుత్వం చేపట్టిన పథకాల వల్ల తమ జీవితాల్లో గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నామని ప్రజలు స్వచ్ఛందంగా వ్యక్తం చేస్తున్నారు.


ముఖ్యంగా మహిళా సంక్షేమం లక్ష్యంగా రూపొందించిన పథకాలు వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తున్నాయి. దీనికి ఉదాహరణగా.. వేములవాడకు చెందిన ఒక సామాన్య మహిళ చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రభుత్వ విధానాలు ప్రజల్లో ఎంత ఆదరణ పొందుతున్నాయో అర్థం అయ్యేలా చేస్తుంది.


వేములవాడ మహిళ తన అనుభవాన్ని వివరిస్తూ.. ఉచిత బస్సు పథకం వల్ల తాను ఆర్థికంగా ఎంత లాభపడ్డానో స్పష్టం చేసింది. ‘ఉచిత బస్సు పథకం ద్వారా నేను ఎంత లాభపడ్డానంటే... నేను బస్సులో చేసిన ప్రయాణ ఖర్చులు ఫ్రీ కావడంతో రెండు లక్షల చిట్టి వేసుకున్నాను’ అని ఆమె ఆనందంగా చెప్పింది. సాధారణంగా ప్రయాణాలకు వెచ్చించే డబ్బు ఆదా కావడం ద్వారా.. ఆ మొత్తాన్ని పొదుపు చేసుకోవడమే కాకుండా, చిట్టీలు లేదా ఇతర పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తు కోసం నిధులను సమకూర్చుకోవచ్చని ఆమె అనుభవం చాటి చెబుతోంది. ఇలా అనేక మంది మహిళలు రోజువారీ ప్రయాణాలకు అధిక మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. ఈ పథకం ద్వారా ఆ ఖర్చులు ఆదా కావడంతో, ఆ సొమ్మును ఇతర అవసరాలకు, ముఖ్యంగా కుటుంబ ఆర్థిక భద్రతకు ఉపయోగించుకునే అవకాశం లభించింది.


ఉచిత బస్సు ప్రయాణంతో పాటు... సన్న బియ్యం పథకం వంటి ఇతర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా మిగిలిన డబ్బుతో తన బిడ్డను బాగా చదివించుకుంటున్నానని ఆ మహిళ సంతోషంగా తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ అన్న (రేవంత్ రెడ్డి) ఇచ్చిన అవకాశాన్ని తాను చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నానని.. ప్రతి మహిళ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చింది. అంతే కాకుండా.. ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకునే మహిళలు దయచేసి.. కండక్టర్లతో గొడవ పడవద్దని సూచించింది. ప్రభుత్వం పది కాలాల పాటు చల్లగా ఉండాలని.. రేవంత్ అన్న మరో పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆ మహిళ కోరుకుంది.


ఈ వీడియో.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ.. వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తోందని స్పష్టం చేస్తోంది. మహాలక్ష్మి పథకం , సన్న బియ్యం పథకం వంటివి కేవలం ఆర్థిక సహాయాలు మాత్రమే కాకుండా,.. మహిళలకు సామాజిక స్వేచ్ఛను, సాధికారతను కల్పిస్తున్నాయి. ప్రయాణ ఖర్చులు ఆదా అవ్వడం వల్ల మహిళలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మరింత సులభంగా పొందగలుగుతున్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా పరోక్షంగా దోహదపడుతుంది. ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa