ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్ ట్రైన్.. రూట్ ఇదే..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 25, 2025, 09:56 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు దేశవ్యాప్తంగా ప్రయాణికుల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. సాధారణ రైళ్లతో పోలిస్తే వందేభారత్‌లో ఉన్న అధునాతన సౌకర్యాలు, వేగం, సౌలభ్యం దీనికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. అధిక టికెట్ ధర ఉన్నప్పటికీ.. గమ్యస్థానాలకు వేగంగా చేరుకునే లక్ష్యంతో ప్రయాణికులు వందేభారత్‌ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.


పండుగల సీజన్లలో అయితే టికెట్లు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని భారతీయ రైల్వే శాఖ మరిన్ని వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. దీనిలో భాగంగా మరో 4 వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అందులో ఒకటి సికింద్రాబాద్ నుంచి పూణే వరకు నడపనున్నారు. అంతే కాకుండా.. పూణె-షెగావ్ (మహారాష్ట్ర), పూణె-వడోదర (గుజరాత్), పూణె-బెళగావి (కర్ణాటక) మధ్య ఈ రైళ్లను నడుపుతారు.


ప్రస్తుతం సికింద్రాబాద్ నుండి నాగ్‌పూర్‌కు వందేభారత్ రైలు నడుస్తున్నప్పటికీ.. దానికి ఆక్యుపెన్సీ ఆశించిన స్థాయిలో లేదు. ఈ రైలును మొదట 20 కోచ్‌లతో ప్రవేశపెట్టగా.. ప్రయాణికుల ఆదరణ లేకపోవడంతో బోగీలను కుదించి ఎనిమిది కోచ్‌లతో నడుపుతున్నారు. దీనికి విరుద్ధంగా.. సికింద్రాబాద్-పూణె మార్గానికి అధిక డిమాండ్ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్, పూణె రెండూ ముఖ్యమైన ఐటీ నగరాలు కాబట్టి.. ఈ మార్గంలో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి పూణెకు శతాబ్ది ఎక్స్‌ప్రెస్ మాత్రమే మధ్యాహ్నం వేళ నడుస్తోంది. వందేభారత్‌ను ఉదయం వేళ ప్రారంభిస్తే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ప్రతిపాదనలు వస్తున్నాయి.


సికింద్రాబాద్-పూణె మధ్య వందేభారత్ అందుబాటులోకి వస్తే దాదాపు మూడు గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా.. మహారాష్ట్ర, కర్ణాటకలోని ఇతర ప్రధాన ప్రాంతాలకు తెలుగు రాష్ట్రాల నుండి వందేభారత్ కనెక్టివిటీని పెంచేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడ నుండి బెంగళూరుకు వయా తిరుపతి ఖరారైన వందేభారత్ త్వరలో పట్టాలెక్కాల్సి ఉంది.


అయితే సాంకేతిక కారణాలతో ఆలస్యం అవుతోంది. వందేభారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభమయ్యే తొలి విడతలోనే తెలుగు రాష్ట్రాలకు కేటాయింపు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సికింద్రాబాద్ నుండి ఢిల్లీ, విజయవాడ నుండి అయోధ్య మధ్య స్లీపర్ సర్వీసుల కోసం ప్రతిపాదనలు ఉన్నాయని.. దీనిపై రైల్వే శాఖ త్వరలో నిర్ణయం తీసుకోనుందని సమాచారం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa