గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు మాధవీ లత. నాటి నుంచి ఇప్పటి వరకు నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలస్తూనే ఉన్నారు. ఈక్రమంలో తాజాగా హైదరాబాద్ పోలీసులు మాధవీ లతను అరెస్ట్ చేశారు. కుండపోత వానలో నిరసన చేస్తున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్కు తరలించారు. మరి ఇంతకు మాధవీ లతను ఎందుకు అరెస్ట్ చేశారు.. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆమె నిరసన చేయడానికి గల కారణాలు ఏంటి అంటే..
బీజేపీ నాయకురాలు మాధవీ లతను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం ఎమ్మెల్యే కాలనీలో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చేసిందని ఆరోపిస్తూ.. మాధవీ లత రోడ్డుపై బైఠాయించారు. ఆమెతో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే.. బంజారాహిల్స్, ఎమ్మెల్యే కాలనీలో.. ప్రభుత్వ స్థలంలో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయాన్ని అధికారులు కూల్చేశారని ఆరోపిస్తూ.. ఆ కాలనీవాసులు గురువారం సాయంత్రం ఆందోళనకు దిగారు.
విషయం తెలుసుకున్న మాధవీ లత.. వారికి మద్దతు తెలపడం కోసం బీజేపీ కార్యకర్తలతో కలిసి అక్కడకు చేరుకున్నారు. అనంతరం కాలనీవాసులతో కలిసి ఆమె కూడా ఘటనా స్థలంలో బైఠాయించారు. ఈ సందర్భంగా మాధవీ లత మాట్లాడుతూ.. పదేళ్లుగా కాలనీ వాసులు.. ఇక్కడ అమ్మవారిని పూజిస్తున్నారని తెలిపారు. అలానే ప్రతి ఏటా ఆషాడమాసంలో బోనం కూడా సమర్పించేవారని.. ఈ ఏడాది బోనాల సందర్బంగా కూడా బోనాలు సమర్పించారని తెలిపారు.
అలాంటి ఆలయాన్ని.. ప్రభుత్వ భూమి అని చెప్పి.. అధికారులు ఆలయాన్ని తొలగించడం సరికాదన్నారు మాధవీ లత. ఆలయంలోని విగ్రహాన్ని తరలించిన తహసీల్దార్.. వెంటనే సంఘటనా స్థలానికి రావాలని ఆమె డిమాండ్ చేశారు. ఓవైపు వర్షం కురుస్తున్నా సరే.. కాలనీ వాసులు, మాధవీ లత.. వానలో తడుస్తూనే నిరసన తెలిపారు. సుమారు నాలుగు గంటల పాటు వారు రోడ్డు మీదనే బైఠాయంచారు. దీంతో విషయం కాస్త పోలీసులకు తెలియడంతో.. బంజారాహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మాధవీ లతను బలవంతంగా పోలీసు స్టేషన్కు తరలించారు.
ఈసందర్భంగా మాధవీ లత మాట్లాడుతూ.. ‘బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ రోడ్ నెం.12 వద్ద శతాబ్దాల నాటి అమ్మవారి దేవాలయాన్ని కూల్చివేయడానికి చేసిన ప్రయత్నం నా మనసును కలచివేస్తోంది. వర్షంలో తడిసిన భక్తులు.. కన్నీళ్లతో అమ్మవారిని రక్షించమంటూ వేడుకుంటున్నారు. పోలీసులు నన్ను గుడిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఒక సనాతన మహిళగా .. అమ్మవారిని బయటకు లాగి, ఆమె ఆలయాన్ని కూల్చివేయడాన్ని చూశాం. ఇది దారుణం, ఇది అధర్మం.ఇది కేవలం భూమి కాదు..ఇది మన భక్తి, మన మాతృరూపం, మన ధర్మం. ఈ దౌర్జన్యాన్ని బహిరంగంగా ఖండిస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు. మాధవీ లత అరెస్ట్ సంచలనంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa