భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఒకే రోజు, శనివారం, రెండు కీలక సమావేశాలు జరగనుండటంతో కార్యకర్తలు ఎటు వెళ్లాలో తేల్చుకోలేక ఆందోళనలో ఉన్నారు. ఒకవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు (కేటీఆర్) ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) సమావేశం జరగనుండగా, మరోవైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి సమావేశం నిర్వహించనున్నారు. ఈ రెండు కార్యక్రమాలు ఒకే రోజు జరగడంతో కార్యకర్తలు ‘ఎటు పోదాం’ అని చర్చించుకుంటున్నారు.
తెలంగాణ జాగృతి కార్యక్రమంలో భాగంగా సంస్థ బలోపేతానికి గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని కవిత నేతృత్వంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశం ద్వారా తెలంగాణ సాంస్కృతిక, రాజకీయ ఉద్యమ స్ఫూర్తిని పునరుద్ధరించి, పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామస్థాయిలో జాగృతి కార్యక్రమాలను మరింత ఊపందుకునేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.
మరోవైపు, బీఆర్ఎస్వీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. విద్యార్థి స్థాయి నుంచే ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపి, యువతలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చేందుకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విద్యార్థి నాయకులతో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా పాల్గొననున్నారు.
ఈ రెండు సమావేశాలు ఒకే రోజు జరగడం వల్ల కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఒకవైపు తెలంగాణ జాగృతి సాంస్కృతిక ఉద్యమానికి ప్రాధాన్యత ఇవ్వాలా, లేక విద్యార్థి విభాగం ద్వారా రాజకీయంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలా అనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితి పార్టీలో సమన్వయ లోపాన్ని తెలియజేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa