ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగస్టు 1 నుంచి కొత్త స్కీమ్,,,కొత్తగా జాబ్‌లో చేరితే రూ.15 వేలు ఇన్సెంటివ్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 26, 2025, 06:41 PM

కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి ఇది నిజంగా సంతోషకరమైన వార్త అనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల.. అంటే 2025 ఆగస్టు 1 నుండి ఒక సరికొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. ఈ పథకం కింద.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో మొదటిసారిగా నమోదైన ఉద్యోగులకు పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన కింద రూ.15,000 వరకు నగదు ప్రోత్సాహం(ఇన్సెంటివ్) అందుతుంది. ఈ పథకం.. ముఖ్యంగా కొత్త ఉద్యోగులకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది.


గతంలో ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌గా పిలిచే ఈ పథకం.. ఉద్యోగాలు ఎక్కువగా సృష్టించడం, కొత్తగా పనిలో చేరే వారికి సపోర్ట్ ఇవ్వడం, అలాగే పొదుపును ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో రూపొందించబడింది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.99,446 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.


ఈ స్కీమ్ ముఖ్యంగా.. మొదటిసారిగా ఉద్యోగ రంగంలోకి అడుగుపెట్టే వారికి సహాయం చేస్తుంది. కంపెనీలు ఎక్కువ కొత్త ఉద్యోగాలు సృష్టించేలా ప్రోత్సహించడం ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. ఈ పథకం నెలకు రూ.1 లక్ష వరకు సంపాదించే ఉద్యోగులకు వర్తిస్తుంది. ఇది ఉద్యోగులు, కంపెనీలు రెండింటికీ ఆర్థికంగా సహాయం అందిస్తుంది. ఈ పథకం 2025 ఆగస్టు 1 నుండి 2027 జులై 31 వరకు అంటే రెండేళ్ల పాటు అమలులో ఉంటుంది. దీని ద్వారా 3.5 కోట్ల కంటే ఎక్కువ ఉద్యోగాలు సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.


ఈ పథకం కింద.. మీరు EPFO (employee provident fund Organisation) లో మొదటిసారిగా రిజిస్టర్ చేసుకున్న ఉద్యోగి అయితే.. రూ.15,000 వరకు నగదు ప్రోత్సాహం పొందుతారు. ఈ డబ్బును రెండు విడతల్లో ఇస్తారు. మొదటి విడత.. ఉద్యోగంలో 6 నెలలు పూర్తి చేసుకున్న తర్వాత లభిస్తుంది. రెండో విడత.. 12 నెలలు పూర్తి చేసుకుని, ఒక ఫైనాన్షియల్ లిటరసీ కోర్సును (ఆర్థిక అక్షరాస్యత కోర్సు) కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత అందుతుంది. పొదుపు అలవాటును ప్రోత్సహించడానికి.. ఈ ఇన్సెంటివ్ అమౌంట్‌లో కొంత భాగాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌లో ఉంచుతారు.


ఈ డబ్బును తర్వాత ఉద్యోగులు తమ అవసరాలకు తగ్గట్టుగా తీసుకోవచ్చు. రూ.15,000 ప్రోత్సాహం నేరుగా ఉద్యోగుల బ్యాంక్ అకౌంట్‌లోకి ఆధార్ బ్రిడ్జ్ పేమెంట్ సిస్టమ్ (ABPS) ద్వారా వెళ్తుంది. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు స్థిరపడటానికి, వారి ఆర్థిక భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. అలాగే.. ప్రతి ఉద్యోగం కల్పించిన సంస్థలకు రూ.3,000 చొప్పున ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తుంది.


ఈ పథకానికి అర్హత సాధించడానికి కంపెనీలు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంది. కంపెనీలో 50 మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉంటే.. కనీసం ఇద్దరు కొత్త ఉద్యోగులను నియమించుకోవాలి. 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే.. కనీసం ఐదుగురిని కొత్తగా తీసుకోవాలి. ఈ కొత్త ఉద్యోగులు కనీసం ఆరు నెలల పాటు జాబ్‌లో ఉండాలి. ఈ ప్రోత్సాహకాలు కంపెనీల పాన్-లింక్డ్ బ్యాంక్ అకౌంట్‌లో నేరుగా జమ అవుతాయి. కంపెనీలు మరిన్ని ఉద్యోగాలను సృష్టించడానికి, ఎక్కువ మందికి ఉపాధి కల్పించడానికి ఈ ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa