ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటితో పాటు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న విస్తారమైన వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం ఉదయం 7 గంటలకు గోదావరి నీటిమట్టం 32.5 అడుగులు దాటి ప్రవహిస్తోంది. నీటిమట్టం పెరుగుదలతో స్నాన ఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు వరదనీటిలో మునిగిపోయాయి. ఎగువ ప్రాంతాల నుంచి ప్రవాహం కొనసాగుతుండటంతో భద్రాచలం వద్ద నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద ప్రముఖ పర్యాటక ప్రదేశం నార చీరల ప్రాంతం వద్దకు వరద నీరు చేరడంతో పర్యాటకులను అక్కడికి వెళ్లకుండా నిలిపివేశారు.
చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం పట్టణంలోకి స్లూయిజ్ల ద్వారా వరద నీరు రాకుండా అధికారులు ముందే మోటార్లను ఏర్పాటు చేసి, పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భద్రాచలం, పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడానికి సిద్ధంగా ఉండాలన్నారు. నదిలోకి వెళ్లడం, నది తీర ప్రాంతాలకు వెళ్లడం పూర్తిగా మానుకోవాలని చెప్పారు. అధికారుల నుంచి వచ్చే సమాచారం, హెచ్చరికలను తప్పకుండా పాటించాలని సూచించారు.
తెలంగాణకు భారీ వర్ష సూచన
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి వెళ్లవద్దని, సురక్షితంగా ఉండాలని అధికారులు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa