రైతన్న తన పంట పొలాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఎండకు, వానకు తట్టుకొని, చీడపీడల బారి నుంచి పంటను రక్షించుకుంటూ.. చివరికి చేతికి వచ్చేదాకా అహర్నిశలు శ్రమిస్తాడు. పండిన పంటకు మార్కెట్లో మంచి ధర వచ్చిందంటే.. అప్పటిదాకా పడిన కష్టాన్ని పూర్తిగా మర్చిపోయి మురిసిపోతాడు. అయితే.. ప్రస్తుతం చాలా మంది రైతులు రసాయన ఎరువులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. పంటకు వేసే ఎరువులు కొనే సమయంలో చాలా మంది రైతులు ఒక ముఖ్యమైన విషయాన్ని విస్మరిస్తుంటారు.. అదే రసీదు (రిసిప్ట్) తీసుకోవడం.
ఈ రసీదుకు ఉచిత బీమా వర్తిస్తుందని చాలా మంది రైతులకు తెలియదు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, రైతన్నలు పొలం పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఈ సమయంలో అనుకోని ప్రమాదాలు జరిగితే.. ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలవడానికి ఇఫ్కో ఎరువుల సంస్థ ఒక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. సంకట హరన్ బీమా పథకం(ఇన్సూరెన్స్ స్కీమ్).
ఈ బీమా పథకం సహకార సంఘాల ద్వారా అధిక మొత్తంలో ఎరువులను కొనుగోలు చేసే ప్రతి రైతుకు వర్తిస్తుంది. దీనికోసం రైతులు ప్రత్యేకంగా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కేవలం ఇఫ్కో ఫెర్టిలైజర్స్ను కొనుగోలు చేస్తే చాలు.. ఈ బీమా వర్తిస్తుంది. ఒకవేళ రైతు మరణించినా, లేదా అంగవైకల్యం సంభవించినా ఈ బీమా వర్తిస్తుంది. ఇది రైతన్నలకు ఆర్థిక భద్రతను కల్పిస్తుంది.
రసీదు భద్రపరుచుకోండి..
రైతులు ఈ బీమా ప్రయోజనం పొందాలంటే.. ఎరువులను కొనుగోలు చేసినప్పుడు ఇచ్చే రసీదును తప్పనిసరిగా భద్రపర్చుకోవాలి. రసీదు పత్రంతో పాటు కొన్ని ధ్రువీకరణ పత్రాలు కూడా అవసరం. రైతు మరణానికి సంబంధించి ఒకవేళ కేసు నమోదైతే.. ఎఫ్ఐఆర్ కాపీ, పోస్టుమార్టం రిపోర్ట్, మరణ ధ్రువీకరణ పత్రం (డెత్ సర్టిఫికెట్) సమర్పించాల్సి ఉంటుంది. ఈ పత్రాలను ప్రమాదం జరిగిన తేదీ నుండి రెండు నెలల్లోగా ఇఫ్కో కార్యాలయంలో అందజేయాలి.
ఎలాంటి ప్రమాదాలకు వర్తిస్తుంది.. ? పరిహారం ఎంత.. ?
ఈ బీమా సదుపాయం గురించి చాలా మంది రైతులకు అవగాహన లేదు. ఈ విషయమై అన్నదాతలకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు, నీటిలో మునిగిపోవడం, పాముకాటు, లేదా ఏదైనా వ్యవసాయ యంత్రం వల్ల ప్రమాదానికి గురైతే ఈ ఇన్సూరెన్స్ పరిహారం చెల్లిస్తారు.
సహకార సంఘాల ద్వారా ఇఫ్కో ఎరువులను కొనుగోలు చేసే వారికి ఈ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తారు. ప్రతి ఎరువు బస్తా, లేదా నానో ఎరువు బాటిల్పై రూ.10 వేల బీమా వర్తిస్తుంది. ఉదాహరణకు.. 20 బస్తాలు ఎరువులు లేదా నానో యూరియా సీసాలను కొనుగోలు చేస్తే.. రూ.2 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఎరువులు కొనుగోలు చేసిన రైతు మరణిస్తే 100 శాతం, రెండు అవయవాలు కోల్పోతే 50 శాతం, ఒక అవయవం కోల్పోతే 25 శాతం బీమా పరిహారం అందుతుంది. ఎరువులు కొనుగోలు చేసిన 30 రోజుల నుంచి 12 నెలల వరకు ఈ బీమా అమల్లో ఉంటుంది. ఈ పథకం రైతన్నల కుటుంబాలకు ఊహించని విపత్తుల సమయంలో ఆర్థికంగా అండగా నిలుస్తుంది. ఇక వీటితో పాటు.. తెలంగాణలో అమలు అవుతున్న రైతు బీమా పథకం కూడా వర్తించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa