ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘వారికి 2003 పింఛన్ విధానమే అమలు చేయాలి’,,,,,తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 30, 2025, 07:58 PM

తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ ఉద్యోగులందరికీ పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని తెలిపింది. మంగళవారం నాడు ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇంతకు ఆ ఉద్యోగులు ఎవరంటే.. డీఎస్సీ 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు. వీరికి పాత పింఛన్‌ విధానాన్ని వర్తింపజేయాలని.. తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాత పింఛన్ విధానం.. 2004, ఆగస్టు 31 వరకు అమల్లో ఉన్నందున.. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులంతా పాత పెన్షన్ విధానికి అర్హులని కోర్టు తేల్చి చెప్పింది. కొత్త కాంట్రిబ్యూటరీ పింఛన్‌ విధానం (సీపీఎస్‌) 2004, సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన విషయాన్ని కోర్టు ఈ సందర్బంగా గుర్తు చేసింది. అయితే ఈ ఉపాధ్యాయుల నియామకం అంతకుముందే పూర్తయిందని కోర్టు స్పష్టం చేసింది.


2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు.. 2004, సెప్టెంబర్‌ నుంచి అమల్లోకి వచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకాన్ని వర్తింపచేయడాన్ని సవాల్ చేస్తూ.. సుమారు 1,738 మంది.. 2019, 2020 సంవత్సరాల్లో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ఈ పిటీషన్లపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘2003, నవంబర్‌ 13న ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2004, జూన్‌ నాటికి వీరంతా టీచర్లుగా నియమితులయ్యారు’అని తెలిపారు.


అయితే ‘పరిపాలనాపరమైన ఆలస్యం వల్ల వీరందరికి 2005, నవంబర్‌లో నియామక ఉత్తర్వులు ఇచ్చారు. అలాంటప్పుడు వీరికి సెప్టెంబర్‌లో తీసుకువచ్చిన పింఛన్‌ విధానాన్ని ఎలా వర్తింపజేస్తారు. పిటిషనర్లంతా పాత పింఛన్‌కు అర్హులు’ అని కోర్టుకు విన్నవించారు. ప్రభుత్వం తరఫున జీపీ వాదనలు వినిపించారు. ఇరు వైపుల వాదనలు విన్న న్యాయమూర్తి.. రిట్‌ పిటిషనర్లు పాత పింఛన్‌ పథకానికి అర్హులని, వారందరికీ ఆమేరకు ప్రయోజనాలు అందించాలని ఆదేశించారు.


పాత పింఛన్‌ విధానంలో..


పాత పింఛన్ విధానం.. ఉద్యోగిపై ఎలాంటి భారం పడకుండా.. వారి భవిష్యత్‌కు భద్రత కల్పించేలా ఉంటుంది. ఈ విధానంలో ఒకవేళ పెన్షన్‌దారుడు మరణిస్తే.. వారి కుటుంబ సభ్యులకు.. పింఛన్‌లో ఎలాంటి కోత లేకుండా పూర్తిగా చెల్లిస్తారు. అలానే నెల వారీ పింఛన్‌గా.. సదరు ఉద్యోగి పదవీ విరమణ సమయానికి చివరి నెల బేసిక్‌ వేతనం ఎంత ఉంటుందో దానిలో 50శాతాన్ని పెన్షన్‌గా నిర్ధారిస్తారు. పాత పింఛన్ విధానంలో డీఏ, డీఆర్‌, పీఆర్సీ సిఫార్సులుండేవి.


కొత్త పింఛన్‌ విధానంలో...


కొత్త ఫించన్ విధానంలో.. ఉద్యోగి జీతంలో ప్రతి నెలా కొంత వెచ్చించాలి. పదవీ విరమణ తర్వాత వచ్చే పింఛన్‌ చాలా తక్కువగా ఉంటుంది. ఈ కొత్త పింఛన్ పద్దతిలో మూలవేతనం, డీఏను కలిపి.. దానిపై ఉద్యోగి 10 శాతం, ప్రభుత్వం 10 శాతం ప్రతి నెలా జమ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఎస్‌బీఐ, యూటీఐ, ఎల్‌ఐసీ షేర్లలో పెడతారు. పదవీ విరమణ చేశాక.. ఒకేసారి 60 శాతం ఒకేసారి ఇస్తారు. మిగతా 40 శాతాన్ని నెలవారీగా లెక్కగట్టి ఇస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa