ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలోని బ్రాహ్మణుల సంక్షేమానికి,,,, బడ్జెట్‌లో రూ.100 కోట్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 30, 2025, 09:10 PM

తెలంగాణ రాష్ట్రంలోని బ్రాహ్మణ వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభవార్త అందింది. రాబోయే కాలంలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం మరిన్ని నిధులు కేటాయిస్తామని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని గౌలిదొడ్డిలో ఉన్న బ్రాహ్మణ సదనంలో సెంటర్ ఫర్ బ్రాహ్మిన్ ఎక్సలెన్స్ (CBE) ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇది బ్రాహ్మణుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను చాటుతుంది.


బ్రాహ్మణ సంక్షేమ పరిషత్..


బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ విషయంలో కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు.


బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు ప్రభుత్వం ఇటీవల రూ.25 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్‌ జ్యోతి బుద్ధప్రకాశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయిస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. అందులో భాగంగా.. త్రైమాసిక బడ్జెట్‌ నిధులను విడుదల చేశారు. ఈ నిధుల విడుదల, బ్రాహ్మణ వర్గానికి అందించే వివిధ సంక్షేమ పథకాల అమలుకు మార్గం సుగమం చేసింది.


గత ఏడాదిన్నరగా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌లో వివిధ పథకాల లబ్ధిదారులు ఈ నిధుల కోసమే ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గతంలో కూడా నిధులు విడుదలైనప్పటికీ, అవి తిరిగి ప్రభుత్వ ఖజానాకు వెనక్కి మళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి అలా జరగకుండా, విడుదలైన నిధులను వెంటనే పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసేలా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌ చొరవ తీసుకోవాలని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు కోరారు. ఈ నిధులతో బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన వివిధ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇంకా అదనపు నిధులను కూడా విడదల చేస్తామన్నారు.


మంత్రి శ్రీధర్ బాబు తన ప్రసంగంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బ్రాహ్మణుల సంక్షేమానికి తమ ప్రభుత్వం నిజమైన చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు. బ్రాహ్మణ సంఘాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని.. వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. విద్య, ఉపాధి, ఆరోగ్య రంగాలలో బ్రాహ్మణ యువతకు, నిరుపేదలకు అండగా నిలవడానికి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు.


తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణులు సాంఘికంగా, ఆర్థికంగా ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి.. వారికి తగిన సహాయాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, విదేశీ విద్యకు ఆర్థిక సహాయం, వేద పాఠశాలలకు మద్దతు, అర్చకులకు గౌరవ వేతనాలు, నిరుపేదలైన బ్రాహ్మణ కుటుంబాలకు ఆసరా వంటి కార్యక్రమాలను బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa